Nakshatram darshakudu reviewsఆగష్టు 4వ తేదీ… సినీ వర్గాలకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ శుక్రవారం నాడు విడుదలైన మూడు ప్రధాన చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరుత్సాహానికి గురి చేసాయి. అందులో ఒకటి బాలీవుడ్ షారుక్ ఖాన్ చిత్రం కాగా, రెండు టాలీవుడ్ చిత్రాలు. ముందుగా టాలీవుడ్ విషయానికి వస్తే… కృష్ణవంశీ ‘నక్షత్రం’ మరియు సుకుమార్ రైటింగ్స్ నుండి ‘దర్శకుడు’ చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి.

ముందుగా అంచనా వేసినట్లే కృష్ణవంశీ “నక్షత్రం” సినిమా ప్రేక్షకులకు పట్టపగలే చుక్కలు చూపించింది. ధియేటిరికల్ ట్రైలర్ తోనే ఈ సినిమా ఫలితంపై ట్రేడ్ వర్గాలు వేసిన అంచనాలు ఈ రోజు నిరూపణ అయ్యాయనే చెప్పాలి. ‘పాత చింతకాయ పచ్చడి’ అన్న టాక్ తో పాటు కృష్ణవంశీ సినిమాలంటే ప్రేక్షకులలో ఉన్న ‘బ్రాండ్’ అంతకంతకూ కుచించుకుపోయేలా ఈ సినిమా ఉండడం విశేషం.

ఇక సుకుమార్ రైటింగ్స్ నుండి వచ్చిన రెండవ చిత్రం “దర్శకుడు” కూడా విజయాల పర్వం కొనసాగిస్తుందని భావించగా, అందుకు విరుద్ధంగా టాక్ ను కైవసం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోగా నటించిన సుకుమార్ సోదరుడి తనయుడు అశోక్ ప్రధాన మైనస్ పాయింట్ తో పాటు, ఓ కాంప్లికేటేడ్ కధను ఎంచుకుని డైరెక్టర్ హరిప్రసాద్ చేసిన ప్రయత్నం విఫలయత్నంగా మిగిలిపోయింది.

టాలీవుడ్ పరిస్థితి ఇలా ఉంటే… బాలీవుడ్ లో విడుదలైన షారుక్, అనుష్క శర్మల “జబ్ హరీ మెట్ సెజల్” ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే సినిమాగా టాక్ ను సొంతం చేసుకుంది. గత కొన్నేళ్లుగా హిట్ మాట మరిచిపోయిన షారుక్ కు ఈ సారి కూడా అదే ఫలితం ఎదురుకావడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కృష్ణవంశీ మాదిరే షారుక్ సినిమాలు కూడా అంతకంతకూ డౌన్ ట్రెండ్ లో కొనసాగుతున్నాయి.