‘మా’ ఎన్నికలు వచ్చే నెలలో జరగబోతున్నాయి. ప్రెసిడెంట్ పదవికి పోటీలో ఉన్న ఇద్దరు తప్పుకుని ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇవ్వడంతో పోటీలో ప్రకాష్ రాజ్ తో పాటు విష్ణు… సీవీఎల్ నరసింహారావు మిగిలారు. మరోవైపు.. బాబు మోహన్ కూడా రంగంలోకి దూకబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి.
ఇక కొత్తగా గతంలో ఉన్న ‘మా’ భవనం తక్కువకు అమ్మేశారని మోహన్ బాబు స్వయంగా రంగంలోకి దూకి విమర్శించారు. అసలు ‘మా’ కి ఉన్నది అమ్మేసింది భవనం కాదని… కేవలం డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అని ఆ మాత్రం తెలీదా అన్నటుగా అప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్న శివాజీరాజా మీడియా ముందు ఆక్షేపించారు.
ఆ సమయంలో ‘మా’ లో భాగమైన నాగబాబు బిల్డింగ్ అమ్మకం వ్యవహారాల్లో నన్ను లాగితే బాగుండదూ అంటూ మోహన్ బాబుకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే విష్ణు, ప్రకాష్ రాజ్ ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం గురించి తెలిసిందే. అసలు ఈ మొత్తం విషయంలో అసలు వీరంతా ఎందుకు కొట్టుకుంటున్నారు అని అర్ధం కాని విషయం.
‘మా’ లో మొత్తం సభ్యులు 900 పై చిలుకు… అందులో సినిమాలు మానేసి సైలెంట్ అయిపోయిన వాళ్ళు, హైదరాబాద్ లో ఉండని వాళ్ళ లెక్క ఎక్కువ.. అటువంటి వారిని తీసేస్తే 500 మంది సభ్యులు కూడా ఉండరు. ఆ మాట అటుంచితే… వీరంతా అధికారం చెలాయించాలి అని తాపత్రయపడుతున్న అసోసియేషన్ ఏళ్ల తరబడి సొంత భవనం కూడా లేకుండా ఉంది.
పైగా ఈ పెద్ద తలకాయలు అంతా కలిసి ఒక డబల్ బెడ్ రూమ్ గురించి ఆరోపణలు చేసుకుంటున్నారు. అలా అని మా వల్ల ఏదైనా పేరు, పరపతి ఉంటుందా అంటే అదీ లేదు. ఇన్ని సంవత్సరాలలో అటువంటి సందర్భమే ‘మా’ చరిత్రలో కనబడదు. ఈ ఉదంతం మొత్తం తరచి చూస్తే… కామెడీగా అనిపించకమానదు. అసలు టాలీవుడ్ పెద్ద తలకాయలకు తలకాయ ఉందా? అని మనకు అనిపించకమానదు.