దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో అధికార పార్టీకి షాక్ ఇచ్చిన బీజేపీకి అన్నీ కలిసొస్తున్నాయి. టీఆర్ఎస్ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఈ ఉపఎన్నిక కోసం బలమైన అభ్యర్థిని నిలబెట్టడానికి బీజేపీ పావులు కదుపుతుంది. ఇందుకోసం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి మీద వల వేసిందని సమాచారం.
ఇప్పటికే జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డితో బీజేపీ నేతలు చర్చలు జరిపినట్టు ప్రచారం సాగుతోంది. 2019లోనే జానారెడ్డి కుమారుడు బీజేపీలో చేరుతారని, ఆయనకు నల్గొండ పార్లమెంట్ టికెట్ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పట్లో చివరి నిమిషంలో చేరిక ఆగిపోయింది. 2009లో నాగార్జునసాగర్ నియోజకవర్గం ఏర్పడ్డాక జరిగిన మూడు ఎన్నికలలో జానా రెండు సార్లు గెలిచారు.
2018లోనే మొదటి సారిగా ఓడిపోయారు. అప్పటినుండి ఆయన కాంగ్రెస్ తో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పని అయిపోవడంతో ఇప్పుడు బీజేపీలో చేరి మళ్ళీ రాజకీయంగా యాక్టీవ్ కావాలనే ఉద్దేశంతో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ కు పెద్ద దెబ్బే… తెరాస కు కూడా అంత తేలిక కాదు.
ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఎదురైతే ఆయన కుమారుడిని నిలబెడతారట. తెరాస నోముల నర్సింహయ్య కుటుంబసభ్యులకే సీటు ఇచ్చే అవకాశం ఉంటుంది. 2018 ఎన్నికలలో నాగార్జున సాగర్ లో బీజేపీ కేవలం 1.48% ఓట్లు దక్కించుకోవడం గమనార్హం. ఈ సీటు కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్తే కేసీఆర్ ప్రభుత్వానికి కష్టకాలం తప్పనట్టే.