‘మన్మథుడు’.. ఈ మాట ఒక్క నాగార్జునను తప్ప మరెవర్నీ అనడానికి లేదు. 16 ఏళ్ల కింద వచ్చిన ఈ చిత్రం ఆయన కెరీర్ లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికీ ‘మన్మథుడు’ సినిమా వచ్చిందంటే టీవీలకు అతుక్కుపోయే వాళ్లున్నారు. అంత కామెడీ ఎంటర్టైనర్గా చరిత్ర సృష్టించింది ఈ చిత్రం. ఇప్పుడు ఆ కథకి సీక్వెల్ కాకపోయినా నాగార్జున మన్మథుడు 2 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టాకీ పార్టు షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. పాటలు షూట్ చెయ్యాలి.
రెండు పాటల చిత్రీకరణ కోసం టీమ్ తొందర్లోనే స్విట్జర్లాండ్ వెళ్ళబోతుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఆగస్టు 9న విడుదల చెయ్యడానికి టీమ్ ఆలోచిస్తుందని సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే మొదటి వారం పూర్తి కాకుండానే ప్రభాస్ సాహూ చిత్రం విడుదల అవుతుంది. ఆ సినిమా కోసం మన్మథుడు 2 థియేటర్లు ఖాళీ చెయ్యాల్సి రావొచ్చు. ఆ హైప్ లో మన్మథుడు 2 బాగున్నా వసూళ్ళు రాబట్టలేకపోవచ్చు. దీనితో నాగార్జునకు ఆ రిస్కు అవసరమా? అని అక్కినేని అభిమానుల అభిప్రాయం.
అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతేడాది ‘చిలసౌ’ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్తో ‘మన్మథుడు 2’ చేస్తున్నాడు నాగార్జున. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కాగా అక్షర గౌడ, కీర్తి సురేష్, సమంతలు కూడా ఈ సినిమాలో చిన్న పాత్రలలో కనిపించబోతున్నారు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు ఈ చిత్రానికి. తానే స్వయంగా నిర్మిస్తున్న మన్మథుడు 2తో కచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకుంటానని ధీమాగా చెబుతున్నాడు నాగార్జున.