nagarjuna akkineni response to rumours annapoorna studios loansటాలీవుడ్ లో అత్యంత తెలివైన వ్యక్తి ఎవరు అంటే… మొదటగా వినపడే పేరు అక్కినేని నాగార్జున. సినిమాల పరంగా, బిజినెస్ పరంగా, రాజకీయ పరంగా… ఏ అంశంలో అయినా నాగ్ ప్రదర్శించినంత చాతుర్యం మరెవరూ ఇవ్వలేరన్నది టాలీవుడ్ వర్గాల మాట. అందులో భాగంగానే ఇటీవల మోడీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించిన కింగ్ నాగార్జునపై ట్రేడ్ వర్గాల్లో అనేక పుకార్లు షికారు చేసాయి.

తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువ బ్లాక్ మనీ కలిగిన వ్యక్తులలో నాగ్ కూడా ఒకరని, ప్రస్తుతం దీనిని వైట్ చేసుకునే పనిలో పడ్డారని, అందు నిమిత్తం తన పేరిట బ్యాంకు అప్పులు మరియు అన్నపూర్ణ స్టూడియోస్ పేరిట ఉన్న మరికొన్ని అప్పులను కూడా చెల్లించి, ఆ నల్లధనాన్ని తెల్లధనంగా నాగార్జున మార్చేసుకున్నారన్న టాక్ సినీ జనాల్లో వ్యక్తమయ్యింది. అయితే ఈ పుకార్లు నాగ్ చెవిన కూడా పడ్డాయేమో గానీ, దానికి స్వస్తి పలికే ప్రయత్నం చేసారు.

“అన్నపూర్ణ స్టూడియోలో అత్యాధునిక సౌకర్యాల ఏర్పాటు నిమిత్తం తానూ బ్యాంకుల నుండి రుణం తీసుకున్న మాట వాస్తవమేనని, అయితే అన్ని లోన్లు ఈ ఏడాది తొలినాళ్ళల్లోనే కట్టేసానని, నా పేరుతో గానీ, అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో గానీ ఎలాంటి అప్పులు లేవని” స్పష్టత ఇస్తూ ట్వీట్స్ చేసారు. అంటే పరోక్షంగా సదరు లోన్లను మోడీ ప్రకటన తర్వాత కట్టలేదని స్పష్టం చేసారు. అయితే నాగ్ ఇంత వివరణ ఉచ్చుకోవాల్సిన అవసరం ఏంటన్న కోణంలో కూడా చర్చలు జరుగుతున్నాయి.