ఒక నటుడు నాగార్జున ఎంతగా విజయం సాధించారో, ఒక బిజినెస్ మెన్ గా అంతకు మించిన సక్సెస్ ఫుల్ పర్సన్ నాగార్జున అని చెప్పవచ్చు. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా పని చేసుకుపోయే నాగార్జున చూపులు, తాజాగా ‘బాహుబలి – ది కన్ క్లూజన్’పై పడ్డాయని తెలుస్తోంది. ఇప్పటికే పలు వ్యాపారాలు నడుపుతున్న నాగార్జున, ‘బాహుబలి’ రెండవ భాగానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
అది కూడా ఏపీలో కృష్ణాజిల్లాకు హక్కులను ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి చేజిక్కించుకున్నట్లుగా సమాచారం. ఈ జిల్లాలో ‘బాహుబలి’ సినిమా దాదాపుగా 7 కోట్లను కొల్లగొట్టడంతో, వచ్చే ఏడాదిలో విడుదల కాబోయే రెండవ భాగాన్ని ఏకంగా 8 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక అగ్ర స్థాయి నటుడిగా, ఒక స్టూడియోకు యజమానిగా, సినిమాల నిర్మాతగా ఉన్న నాగ్, కేవలం కొన్ని కోట్ల రూపాయల కోసం డిస్ట్రిబ్యూటర్ గా మారడం ఏంటన్న టాక్ అభిమానుల మధ్య చర్చనీయాంశమైంది.
మరి నాగ్ అంటే అదే… పక్కా బిజినెస్ మెన్… నేను పక్కా బిజినెస్ మెన్… అని ఇప్పటికే పలు సందర్భాలలో చాటుకున్న నాగ్, ఈ సందర్భంగా కూడా అలాంటి తన ఉద్దేశాన్ని చాటుకున్నాడు. తన సినిమా కాకపోయినా… ‘బాహుబలి’ రికార్డుల రీత్యా, ఈ సినిమా కూడా అంతకు మించిన వసూళ్లు చేస్తుందన్న ఉద్దేశంతోనే సాయి కొర్రపాటితో కలిసి కృష్ణాజిల్లాను దక్కించుకున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి.