Nagam Janardhan Reddy Slams KCR Over Irrigation Projectsఇటీవల అసెంబ్లీలో నీటి ప్రాజెక్టులపై సుదీర్ఘ ప్రసంగం చేసిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్… ఈ క్రమంలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ ను కేవలం 30 నెలల్లో పూర్తి చేస్తానని ప్రకటన చేసారు. అయితే అసలు కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ మొత్తం బోగస్ అన్న ప్రతిపక్ష నాయకులు, ప్రజలను మభ్య పెట్టే ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.

బిజెపి నేత నాగం జనార్ధనరెడ్డి అయితే ఒకడుగు ముందుకేసి ముఖ్యమంత్రి వర్యులకు భారీ ఆఫర్ ను కూడా ప్రకటించారు. కేసీఆర్ శాసనసభలో చెప్పినట్టు పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ ను 30 నెలలలో పూర్తి చేస్తే తానూ ‘అరగుండు’ కొట్టించుకుంటానని సవాల్ విసిరారు. ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకుంటే, తానూ చేసిన సవాల్ కు నిలబెట్టుకునే బాధ్యత తనదని చెప్పిన నాగం, కేసీఆర్ చేస్తున్న మోసాలు, తప్పులతో ప్రజల్లోకి వెళ్లి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని అన్నారు.

స్వార్థంతో కేసీఆర్ చేస్తున్న తప్పులకు జైలుకు వెళ్లక తప్పదని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల అంచనాలు 6 నెలల్లోనే రెట్టింపు ఎలా అయ్యాయని ప్రశ్నించారు. ప్రాజెక్టుల అంచనాలు, టెండర్లు వంటి విషయాల్లో తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు నిజాయితీగా చెబితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, చెప్పలేకపోతే కేసీఆర్ బహిరంగంగా లెంపలు వేసుకుంటారా? అంటూ తీవ్ర పదజాలంతో స్పందించారు.