Nagababu_Konidela_Rojaమెగా బ్రదర్ నాగబాబు, రోజా ఇద్దరూ సినీ నటులే కావడంతో పార్టీలకి, రాజకీయాలకి అతీతంగా చాలా ఏళ్ళు కలిసి ‘జబర్దస్త్’ షోలో పనిచేశారు. కానీ రోజా తనకి ఎంతో ఇష్టమైన జబర్దస్త్ షోని మంత్రి అయ్యాక మానుకోవలసివచ్చింది. అది వేరే విషయం. కానీ మంత్రి పదవి నిలబెట్టుకోవడానికి ఆమె తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లను ఉద్దేశ్యించి చాలా అనుచితంగా విమర్శిస్తున్నారు. అక్కడితో ఆగకుండా ‘మెగా బ్రదర్స్ ముగ్గురూ వారి జిల్లాకి చేసిందేమీ లేదు కనుక ముగ్గురినీ ప్రజలు తిరస్కరించారంటూ’ ఇటీవల చిరంజీవి, నాగబాబులని కూడా మంత్రి రోజా చాలా దారుణంగా విమర్శించారు.

ఇంతకాలం ఆమెతో కలిసిపనిచేశామనే భావనతో చిరంజీవి, నాగబాబు ఇద్దరూ కూడా ఆమె మాటలని పట్టించుకోలేదు. కానీ ఆమె తమ ముగ్గురి గురించి నోటికివచ్చిన్నట్లు మాట్లాడటంతో నాగబాబు తొలిసారిగా చాలా తీవ్రంగా స్పందించారు. ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో సందేశంలో మాట్లాడుతూ, “మన దేశంలో పర్యాటక రంగం 20 స్థానాల ర్యాంకింగ్‌లో మొదటి మూడు స్థానాలలో కేరళ, అస్సామ్, గుజరాత్ రాష్ట్రాలు ఉంటే, మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 18వ స్థానంలో ఉంది. నువ్వు ఇలాగే నీ బాధ్యతలు మరిచిపోయి రోజూ పిచ్చపిచ్చగా మాట్లాడుతూ కాలక్షేపం చేస్తుంటే, నువ్వు ఈ మంత్రి పదవిలో నుంచి దిగిపోయేలోగా మన రాష్ట్రం 20వ స్థానానికి చేరుకొంటుంది.

ఏపీలో పర్యాటక శాఖ మీద ఆధారపడి కొన్నివేలమంది జీవిస్తున్నారు. రాష్ట్రంలో మీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్లందరి జీవితాలు మట్టికొట్టుకుపోయాయి. కనుక మంత్రివి కనుక మంత్రిగా నీ బాధ్యతలను తెలుసుకొని నీ శాఖ గురించి ఆలోచించు. పర్యాటక శాఖ మంత్రివి అంటే నువ్వు పర్యటనలు చేయడం కాదు. రాష్ట్రంలో పర్యాటకశాఖని, పర్యాటక ఆకర్షణ కేంద్రాలను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకో.

రోజా… ఇంతకాలం నువ్వు నా తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ గురించి, నా గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నా పట్టించుకోలేదు. ఎందుకంటే నీ నోరు ఓ మున్సిపాలిటీ కుప్ప తొట్టిలాంటిది. కనుక ఎవరూ తెలిసితెలిసి ఆ కుప్పతొట్టిని కెలకాలనుకోరు. కానీ రోజురోజుకీ నువ్వు మా అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతుంటే ఇక భరించలేక ఇప్పుడు జవాబు చెప్పాల్సివస్తోంది.

రోజా.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పర్యాటకశాఖ మంత్రిగా పనిచేయడం నేర్చుకో… పర్యాటక శాఖని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చెయ్యి,” అని నాగబాబు ఘాటుగా హెచ్చరించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో సందేశం వైరల్ అవుతోంది. దీనిపై మంత్రి రోజా ఏవిదంగా స్పందిస్తారో ఊహించుకోవచ్చు.