Nagababu joining Janasena- (1)మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నారు. బాలయ్య ఎప్పుడో పవన్ కళ్యాణ్ మీద ఏదో అన్నాడని దానిని అడ్డం పెట్టుకుని దాదాపుగా నెలరోజులు బాలయ్య ను విమర్శిస్తూ వీడియోలు పెట్టి టార్గెట్ చేశారు. కమ్మ కాపు కులాల మధ్య చిచ్చు పెట్టి జనసేనకు లబ్ది చేకూర్చడం కోసమే నాగబాబు ఇలా చేస్తున్నారు అని చాలా మంది అనుకున్నారు. అయితే బాలయ్య సమన్వయం పాటించడంతో ఆ గొడవ తప్పింది. ఇప్పుడు నాగబాబు తాజాగా నా ఇష్టం అని ఒక సిరీస్ మొదలు పెట్టి రాజకీయ నాయకులు ఎప్పుడన్నా నోరు జారితే దాని మీద సెటైర్లు వేస్తున్నారు.

ఇప్పటివరకు లోకేష్, జగన్ లను టార్గెట్ చేశారు. జనసేన కోసం సోషల్ మీడియాలో గట్టిగా పనిచేసి పవన్ కళ్యాణ్ దృష్టిలో పడి తిరిగి రాజకీయాలలోకి రావాలని నాగబాబు వ్యూహమని చాలా మంది అభిప్రాయ పడ్డారు. ప్రజలకు ప్రజారాజ్యం రోజులు గుర్తు రాకూడదని పవన్ తన కుటుంబాన్ని జనసేనకు దూరం పెట్టారు. అయితే ఇప్పుడు తాజాగా తెలుస్తుంది ఏంటంటే నాగబాబు ఇప్పటికే జనసేనలో చేరారని కాకపోతే పార్టీకి ఇబ్బంది లేకుండా తెర వెనుక పని చేస్తున్నారని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా నాగబాబు రాజమహేంద్రవరంలో కాంప్ చేసి జనసేనకు మద్దతుగా చాలా మందిని కలుస్తున్నారట.

ప్రజారాజ్యం లో క్రియా శీలంగా పనిచేసిన వారిని, కాపు కుల ప్రముఖులను కలిసి పార్టీ కోసం పని చెయ్యమని అడుగుతున్నారని తెలుస్తుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టే ముందు పెట్టిన తరువాత నాగబాబు చేసిన పని ఇదే. ఎన్నికల తరువాత ఆయనను తెర మీదకు తెచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక ఎన్నికలలో పోటీ చేయించకుండా ఆయనకు ఎన్నికల తరువాత ఏదైనా నామినేటెడ్ పదవి ఇచ్చి పార్టీ గౌరవిస్తుందని చెబుతున్నారు. ఇటీవలే నాగబాబు ఆయన కుమారుడు వరుణ్ తేజ్ జనసేన పార్టీకి భారీ విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.