Naga Chaitanya and Sai Pallavi Love Storyశేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రేమకథగా తెర కెక్కనున్న ఈ చిత్రాన్ని ఏషియన్‌ సినిమాస్‌ సునీల్‌ నారంగ్‌ నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో నెల రోజుల పాటు ఒక భారీ షెడ్యూల్ ప్లాన్ చేసి సక్సెస్ ఫుల్ గా చేస్తున్నారు కూడా. మధ్యతరగతి ప్రేమకథగా ఈ చిత్ర కథాంశం ఉంటుందని సమాచారం.

ఈ సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ అనుకుంటున్నారట. కొత్త నటీనటులతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా మొదలు పెట్టి, హీరో సరిగా లేడు అనే కారణంగా ఆ సినిమాను మధ్యలోనే ఆపేశారు. ఇప్పుడు అదే స్క్రిప్టును యువసామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవిలతో ఈ సినిమాగా తీస్తున్నారు. ఫిదా తరువాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా కనిపిస్తాడట. దీని కోసం తెలంగాణ యాసలో మాట్లాడటానికి కోచింగ్ తీసుకుంటున్నాడు చైతన్య. శేఖర్ కమ్ములతో సినిమా అనగానే తన వేరే కమిట్ మెంట్స్ అన్నీ పక్కన పెట్టి ఈ చిత్రానికి బల్క్ డేట్స్ ఇచ్చాడు ఈ అక్కినేని హీరో. మరి దీనితో ఆయన ఇంకో హిట్ కొడతాడా అనేది చూడాల్సిఉంది.

డిస్ట్రిబ్యూటర్స్‌గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. కాగా మజిలీతో ఈ సంవత్సరం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నాగచైతన్య.. ప్రస్తుతం వెంకటేష్‌తో కలిసి వెంకీమామ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 13న విడుదల కానున్నట్టు సమాచారం.