మెగా బ్రదర్ నాగబాబు మొన్న ఆ మధ్య జబర్దస్త్ నుండి మాయం అయిపోయారు. ఆయన స్థానంలో అలీ రోజా పక్కన కూర్చున్నారు. ఇటీవలే జనసేన తరపున రాజకీయరంగేట్రం చేసిన నాగబాబు తమ్ముడిలానే సినిమాలకు, టీవీ షోలకు దూరంగా ఉంటారని అంతా భావించారు. అయితే ఎన్నికలలో నాగబాబు ఓడిపోయారు. ఆయన పోటీ చేసిన నరసాపురం పార్లమెంట్ లో మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు. దీనితో మళ్ళీ జబర్దస్త్ వైపు వచ్చేశారు నాగబాబు.
టీవిలో వస్తున్న జబర్దస్త్ తాజా ప్రోమోలలో రోజా పక్కన నాగబాబు కనిపిస్తున్నారు. గతంలో ఈ షోలో కనిపించిన మీనా, సంఘవి, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, అలీలు కనిపించకపోవడం విశేషం. నిన్న పవన్ కళ్యాణ్ మంగళగిరిలో నిర్వహించిన జనసేన రివ్యూ మీటింగుకు నాగబాబు హాజరయ్యారు. వచ్చే ఐదేళ్ళు తాత్కాలికంగా రాజకీయాలలో ఫుల్ టైం టీవీ షోలతో నాగబాబు కాలం గడిపేసి 2024 ఎన్నికల కొంచెం ముందు మళ్ళీ రాజకీయాలలో యాక్టీవ్ అవ్వొచ్చు.
మరోవైపు నాగబాబు జబర్దస్త్ కో- జడ్జ్ గా వ్యవహరిస్తున్న రోజా నగిరి నుండి రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రేపు ప్రమాణస్వీకారం చెయ్యబోయే జగన్ కేబినెట్ లో రోజా కూడా మంత్రి అయ్యే అవకాశం ఉందని సమాచారం. మంత్రి అయ్యాక కూడా రోజా టీవీ షోలలో నటిస్తారో లేదో చూడాలి. ఎన్నికల సందర్భంగా జనసేన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీగా పోరు జరిగి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నా నాగబాబు రోజా మధ్య సత్సంబంధాలే ఉన్నాయట.