Nag- Ashwin - Prabhas- Vyjayanthi -Movies-యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరికొత్త ప్రాజెక్టు కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. మహానటి లాంటి అద్భుతమైన సినిమాను అందించిన నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని తన వైజయంతి మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే… బాహుబలి లాంటి పెద్ద సినిమా తరువాత ప్రభాస్ పెద్ద దర్శకుల వెంట పడటం లేదు. బాహుబలి 2 తరువాత వచ్చిన సాహూ కు సుజిత్ అనే రెండో సినిమా దర్శకుడు పని చేశాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఓ డియర్ అనే సినిమా దర్శకుడు రాధాకృష్ణకు కూడా ఇది రెండో సినిమానే.

ఇక ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా ఇంతకు ముందు రెండు సినిమాలు మాత్రమే చేశాడు. పెద్ద దర్శకులతో చెయ్యడం లేదని ప్రభాస్ అభిమానులకు ఒక లోటు ఉన్నా మహానటి లాంటి అద్భుతమైన సినిమాని ఇచ్చిన నాగ్ అశ్విన్ తో పని చేస్తున్నందుకు వారు హ్యాపీ గానే ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఓ డియర్ సినిమా ఈ ఏడాది విజయదశమికి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

దీనితో నాగ్ అశ్విన్ సినిమా ఈ ఏడాది చివరన సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఆరు నెలల నుండి ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నాడు నాగ్ అశ్విన్. సినిమా సెట్స్ మీదకు వెళ్ళేటప్పటికీ చిత్రానికి సంబంధించిన బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం అవుతుందట. ఈ చిత్రం కూడా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ బాషలలో ఒకేసారి విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.