మాజీ స్పీకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రేపు జనసేన పార్టీలో చేరనున్నారు. ఈరోజు సాయంత్రం మనోహర్ తిరుమలకు వెళ్లనున్నారు. జనసేన అధినేత పవన్కల్యాణ్ సైతం ఈరోజు రాత్రికి తిరుమలకు చేరుకోనున్నారు. రేపు ఉదయం వారిద్దరూ కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు.
అనంతరం జనసేనలో చేరుతున్న విషయాన్ని నాదెండ్ల మనోహర్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటివరకు జనసేనలో ఇతర పార్టీల నుంచి కీలక నేతలెవరూ చేరలేదు. ఇప్పటివరకు వచ్చిన వారందరు వేరే పార్టీలలో టిక్కెట్టు నిరాకరింపడినవారు, జనం మర్చిపోయిన మాజీ ఎమ్మెల్యేలు. మనోహర్ రాకతో ఆ పార్టీ కేడర్లో మరింత ఉత్సాహం నెలకొంటుందని భావిస్తున్నారు.
2014లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీలోని ముఖ్య నేతలంతా పార్టీని వీడినప్పటికీ మనోహర్ మాత్రం ఇప్పటివరకూ అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి నుంచి రెండు సార్లు శాసనసభకు ఎన్నికైన ఆయన…2011లో అప్పటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో స్పీకర్ అయ్యారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.