జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి తన పోరాట యాత్ర మొదలు పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా లో ఆయన యాత్ర సాగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటుగా అనునిత్యం మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కనిపిస్తున్నారు. ఇటీవలే పార్టీ లో చేరిన మనోహర్ తో పవన్ అంత క్లోజ్ గా మెలగడం మాములు ప్రజలకు ఆశ్చర్యం గానూ పార్టీ వారికి కంట గుంపుగా మారింది. అయితే పవన్ పక్కన ఎవరు పెర్మనెంట్ గా ఉండక పోవడం గమనార్హం.
ప్రజారాజ్యం పార్టీలో పవన్ పక్కన ఉన్నవాళ్ళంతా ఆ తరువాత వేరే పార్టీలలో చేరిపోయారు. ఆ విషయం పక్కన పెడితే జనసేన పెట్టిన తరువాత కూడా పవన్ పక్కన ఉన్న వారు మారిపోయారు. పార్టీ ఆవిర్భావ సభలో పొట్లూరి వరప్రసాద్, పవన్ తో ఒక పుస్తకం రాసిన రాజు రవితేజ అంతా తామే అన్నట్టుగా నడిపించారు. ఆ తరువాత పీవీపీ పూర్తిగా పక్కకు తప్పుకోగా, రాజు రవితేజ కొంత కాలం మాయమయ్యి ఈ మధ్య అప్పుడప్పుడు మళ్ళీ కనిపిస్తున్నారు.
ఎన్నికల తరువాత జనసేన లో అంతా తానై నడిపించింది ఆ పార్టీ కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య. ఈ మధ్య ఎందుకనో పవన్ కళ్యాణ్ ఆయనను పూర్తిగా పక్కన పెట్టారట. ఆయన పార్టీ ఆఫీసు కు కూడా రావడం మానేశారు అని జనసేన వర్గాలు అంటున్నాయి. ఆ తరువాత వైకాపా నుండి జనసేన లోకి వచ్చిన తోట చంద్రశేఖర్ కు పవన్ కొంత కాలం విపరీతంగా ప్రాధాన్యత ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పెట్టిన జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ లో ఆయన కీలక పాత్ర పోషించారు.
అయితే మనోహర్ పార్టీ లో చేరకా పవన్ పక్కన ఉండే ఆయన ఇప్పుడు వెనుకకు వెళ్లిపోయారు. ఇప్పుడు మనోహర్ ఏకంగా పార్టీలో నెంబర్ 2 అన్నట్టుగా ఉన్నారు. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన ఆయన కోసం ఎప్పటినుండో ఉన్న వారిని పక్కన పెట్టడం పాత వారికి మింగుడు పడటం లేదు. కాకపోతే మనోహర్ కు ప్రజలలో సౌమ్యుడు అనే పేరు ఉంది ఆయనను పక్కన పెట్టుకుంటే కొన్ని వర్గాలలో తన ఇమేజ్ పెరుగుతుంది అని జనసేనని భావిస్తున్నారట. అలాగే కమ్మ కులానికి చెందిన నాదెండ్ల ను పక్కన పెట్టుకుంటే తనకు కులమత బేధాలు లేవని తాను కాపులకు మాత్రమే పరిమితం కాదు అనే మేసేజ్ వెళ్తుందని ఆయన అనుకుంటున్నారట. దీనితో చేసేది ఏమి లేక అభిమానులు పవన్ తో పాటు ఆయనకు కూడా ఒక దండ వేస్తున్నారు ఎక్కడకు వెళ్తే అక్కడ… కొందరేమో మనోహర్ మాత్రం ఎన్ని రోజులో చూద్దాం అనుకుంటున్నారట.