పోలవరం ప్రాజెక్టు కోసం 2017-18 ఆర్థిక సంవత్సరంలో రావాల్సిన రూ.1,400 కోట్లు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఈ మొత్తం శుక్రవారం ప్రాజెక్టు అథారిటీ ఖాతాలో జమయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 31లోపే (2017-18 ఆర్థిక సంవత్సరం) 1400 కోట్లు విడుదల కావాల్సి ఉంది. అయితే అనేక వంకలతో వీటిని ఆపుతూ వచ్చారు.
నిధుల సమీకరణ కోసం నాబార్డు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించి నిధులు ప్రాజెక్టు అథారిటీ ఖాతాకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన మరో 766 కోట్ల బిల్లులు ప్రస్తుతం ప్రాజెక్టు అథారిటీ వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఈ నిధులన్నీ కేంద్రం పాత డీపీఆర్ ప్రకారమే ఇస్తోంది. కొత్త డీపీఆర్కు ఆమోదముద్ర వేయలేదు.
పాత డీపీఆర్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు సాగునీటి విభాగం అంచనా వ్యయం 12,294 కోట్లు. రాష్ట్ర విభజనకు ముందే దీనిపై 5,136 కోట్లు వెచ్చించారు. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వబోమని లోగడే కేంద్రం స్పష్టం చేసింది. అదిపోగా మిగిలిన 7,158 కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో ఇప్పటివరకూ ప్రస్తుత 1,400 కోట్లతో కలిపి 6,764 కోట్లు చెల్లించినట్లయింది. ఇక మిగిలింది 395 కోట్లు మాత్రమే.
ఒకవేళ పోలవరం ప్రాజెక్టు సవరించిన డీపీఆర్కు కేంద్రం ఆమోదించకపోతే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి కేవలం రూ.395 కోట్లు మాత్రమే వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.53వేల కోట్లతో సవరించిన అంచనాలు పంపింది. అందులో సహాయ, పునరావాసానికి రూ.33,225 కోట్లు, సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.20,509.46 కోట్లు ఖర్చవుతుందని అంచనా