naa-peru-surya-movie-controversy‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెలరేగిన వివాదాలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అల్లు అరవింద్ చేసిన కుట్ర కోణం వ్యాఖ్యలు హైలైట్ కావడంతో, ముందుగా ‘నా పేరు సూర్య’ ఈవెంట్ కు పబ్లిసిటీ అయితే బాగా జరిగింది. మరో నాలుగు రోజుల్లో విడుదల ఉండడంతో, ఈ వ్యాఖ్యలు సినిమా ఓపెనింగ్స్ కు బాగా దోహదం చేయనున్నాయి.

ఇటీవల టాలీవుడ్ లో జరిగిన పరిణామాలతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, ఈ ప్రభావంతో ‘నా పేరు సూర్య’ సినిమాపై నెగటివ్ టాక్ ప్రచారం చేయడానికి తెరవెనుక కుట్రలు జరిగాయని, దీనిని ఇప్పుడు ప్రస్తావించడం తనకు ఇష్టం లేదని, సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడతానని, దీనిపై బన్నీ సైలెంట్ గా ఉండాలని, తర్వాత అంతా చెప్తానని అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేసారు.

అయితే దీని తర్వాత మైక్ పట్టుకున్న బన్నీ, అభిమానులు చేస్తోన్న గోలను చూసి… ‘మాట్లాడనివ్వండయ్యా బాబు… మళ్ళీ ఛాన్స్ వస్తుందో లేదో…’ అంటూ సక్సెస్ మీట్ పై సందేహాలు వ్యక్తం చేసారు. అలాగే ఈ సినిమాకు ఓ బయట వ్యక్తి వస్తే బాగుటుందని, అందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ‘రంగస్థలం’తో ప్రారంభమైన సక్సెస్ ను ‘భరత్ అనే నేను’ కొనసాగిస్తోందని, ఇప్పుడు ‘నా పేరు సూర్య’ కూడా అనుసరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు అల్లు అర్జున్ ప్రసంగించారు.