ముగ్గురు ఒలింపిక్ స్టార్లు పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్, భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు నాలుగు బీఎండబ్ల్యూ కార్లను క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అందజేశారు. హైదరాబాద్ లోని పుల్లెల గోపీచంద్ అకాడెమీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో నలుగురికి కార్లను అందజేశారు. ఈ నలుగురి కోసం సేకరించిన నాలుగు కార్లు మూడు రంగుల్లో ఉన్నాయి.
పీవీ సింధుకు ఎరుపు రంగు కారు, సాక్షి మాలిక్ కు బ్లూ కలర్, దీపా, గోపీచంద్ లకు తెలుపు రంగు కార్లను అందజేశారు. పీవీ సింధుకు క్రీడా ప్రముఖుడు చాముండేశ్వరినాథ్ కారును గిఫ్ట్ గా ఇవ్వగా, పుల్లెల గోపీచంద్ కు ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కారును ఇచ్చారు. ఇక సాక్షి, దీపాలకు అందజేసిన వారి జాబితాలో ‘శ్రీమంతుడు’ సినిమా నిర్మాతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
సచిన్ పక్కన ‘శ్రీమంతుడు’ సినిమా నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని దర్శనమివ్వడంతో అవాక్కైన మీడియా వర్గాలకు కార్లను స్పాన్సర్ చేసిన వారిలో మైత్రీ మూవీస్ సంస్థ కూడా ఉన్నట్లు తెలిసింది. ఆ కారణంతోనే ఈ బహుకరణ వేడుకలో నవీన్ హాజరైనట్లుగా మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. సచిన్ వెళ్ళిపోయే సమయంలో కొద్ది క్షణాల పాటు నవీన్ యెర్నేనితో మాట్లాడడం విశేషం.
ఇక, ఈ ఈవెంట్ లో మరో హైలైట్ గా నిలిచింది సచిన్ సెల్ఫీ ఫోటో. శంషాబాదు ఎయిర్ పోర్టు నుంచి నేరుగా అకాడెమీకి చేరుకున్న సచిన్… అక్కడికి అప్పటికే చేరుకున్న ఒలింపిక్ స్టార్లు పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ లను ప్రత్యేకంగా పలుకరించారు. వారితో కరచాలనం చేసిన సచిన్… వారితో వేర్వేరుగా ముచ్చటించారు. అనంతరం వేదిక ఎక్కిన సచిన్ గోపీచంద్, సింధు, సాక్షి, దీపాలతో కలిసి ఓ సెల్ఫీ తీసుకోవడం క్రీడాకారుల్లో మరింత ఆనందాన్ని కలిగించింది.