తుని విధ్వంసంలో బాధ్యులైన 13 మందిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయగా, వారిని విడుదల చేసే వరకు తన దీక్ష విరమించేది లేదని స్పష్టం చేసిన ముద్రగడ డిమాండ్స్ ను ప్రభుత్వం అమలు చేయక తప్పలేదు. 13 మంది బెయిల్ ఇచ్చేందుకు కోర్టులో అభ్యంతరం చెప్పకపోవడంతో దఫాల వారీగా బెయిల్ మంజూరైంది. దీంతో దీక్షను విరమించాల్సిందిగా ముద్రగడను కోరిన ప్రభుత్వ వర్గాలకు మరో షాక్ ఇచ్చారు. చంద్రబాబు సర్కార్ ను ఇరుకున పెట్టేందుకు దీక్ష విరమణకు కొత్తగా సరికొత్త మెలికలు పెట్టారు.
తనను మరియు జైలు నుంచి విడుదలైన 13 మందినీ పోలీసు వ్యాన్ లో కిర్లంపూడికి తీసుకువెళ్లాలని, అక్కడికి కలెక్టర్, ఎస్పీలు వచ్చి నిమ్మరసం ఇవ్వాలని ముద్రగడ షరతులు పెట్టగా, అలా చేసే సమస్యే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇప్పటివరకూ ముద్రగడ షరతులను అంగీకరించామని, కొత్త వాటిని ఒప్పుకోబోమని స్పష్టం చేసిన ప్రభుత్వం, ఇక దీక్ష విరమించి ఇంటికి వెళ్లాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని సమాచారం.