విజయవాడలో జరిగిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సందర్భంగా ప్రసంగించిన ముద్రగడ… “తాను రాజకీయ పార్టీలకు అమ్ముడుపోలేదని, తన జాతిని ఎవరికీ తాకట్టు పెట్టలేదని, తాను చేసిన దీక్ష తెల్లచొక్కాల కోసం కాదని, పేదలకు గౌరవం కల్పించేందుకేనని, కాపు రిజర్వేషన్ల వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయని” తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేసారు.
చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగానే తప్ప కొత్త డిమాండ్లు ఏమీ చేయలేదని, ఆలస్యంగా అయినా ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని చంద్రబాబు చెప్పడం ముదావహమని ముద్రగడ అభిప్రాయపడ్డారు. జగన్ చెబితే తానేదో చేస్తానని చెప్పడం అభూతకల్పన అని, జగన్ వయసు తన రాజకీయ అనుభవమంత లేదని కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తెలిపారు.