ఇండియన్ క్రికెట్ లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పతనం ప్రారంభమైనట్లుగానే కనపడుతోంది. ఓ వైపు తన బ్యాటింగ్ తీరుతో తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తున్న ధోని, అటు కెప్టెన్ గానూ జట్టుకు విజయాలను అందించడంలో విఫలమవుతున్నాడు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో… తాజాగా ధోని బ్రాండ్ అంబాసిడర్ గా వహిస్తున్న పెప్సీ ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.
గత 11 సంవత్సరాలుగా ధోని ‘బ్రాండ్ అంబాసిడర్’గా వ్యవహరిస్తున్న పెప్సీ సంస్థ, టీమిండియా వన్డే కెప్టెన్ ను కాదని, టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లిని నియమించుకోవడం మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ధోని శకానికి ఇక ముగింపు పలికే రోజులు త్వరలోనే ఉన్నాయని, దానికి పెప్సీ సంస్థ నాంది పలికిందని ట్రేడ్ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. సుదీర్ఘమైన 11 ఏళ్ళ వాణిజ్య బంధాన్ని త్రుటిలో తెంచుకోవడం ఒక రకంగా ధోనికి షాకింగ్ లాంటిదే.
అయితే ధోని స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లి ఎంపిక పెప్సీకో సంస్థ ఓ అధికారిక ప్రకటన వెలువరించాల్సి ఉంది. టెస్ట్ కెప్టెన్ గా జట్టుకు విజయాలు అందించడంతో పాటు, జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తూ బ్యాట్స్ మెన్ గా చరిత్ర సృష్టిస్తున్న విరాట్ కోహ్లి వైపే ప్రస్తుతం మల్టీ నేషనల్ సంస్థలు చూస్తున్నాయి. డౌన్ ట్రెండ్ లో ఉన్న ధోని, అంతకంతకూ కుచించుకుపోతారో లేక పడిలేచిన కెరటంలా పైకి వస్తారో కాలమే నిర్ణయించాలి.