వైఎస్సార్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సొంత పార్టీకే కొరకరాని కొయ్యిగా మారారు. స్వపక్షంలోనే విపక్షంగా మారి చికాకు రప్పిస్తున్నారు. అయితే ఆయన వెనుక మేము ఉన్నాం అంటూ బీజేపీ చెప్పకనే చెప్పింది. తాజాగా ఆయనకి కేంద్రం ‘వై’ కేటగిరి భద్రతను పెంచింది.. సుమారుగా 10 మంది వరకు ఆయనకి భద్రతా సిబ్బంది ఉండనున్నారు.
ఆయన విజ్ఞప్తి మేరకు సీఆర్పీఎఫ్ బలగాలతో ‘వై’ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. గతంలో అయన సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి తనకు ముప్పు ఉందంటూ ఎంపీ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తనకు భద్రత కల్పించిన తర్వాతే నియోజకవర్గానికి వెళతానని అయన గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోనే ఉండిపోయారు.
దీనిపైన స్పందించిన కేంద్రం వై కేటగిరి భద్రతను కల్పించింది. ఈమేరకు ఏపీ డీజీపీ, సీఆర్పీఎఫ్ డీజీకి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఒక రాజకీయ ఆరోపణపై కేంద్రం వై కేటగిరి ఇవ్వడం అనేది చాలా అరుదు. ఖచ్చితంగా అది రాజకీయపరమైన నిర్ణయం అనే చెప్పుకోవాలి.
రఘురామకృష్ణరాజు తమ మనిషి అని కేంద్రం చెప్పకనే చెప్పింది. జగన్ మీద ఉన్న కేసుల ఇబ్బంది ఉండటంతో బీజేపీతో తంటా తెచ్చుకునే సాహసం వైఎస్సార్ కాంగ్రెస్ చెయ్యదు అని అందరికీ తెలిసిందే. ఇక అధికార పార్టీ వారు ఆయన జోలికి వెళ్లకపోతేనే బెటర్ ఏమో!