CBI MP -YS Avinash Reddyవైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, తనకి సీబీఐ నోటీసు పంపడంపై స్పందించారు. ఈరోజు పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ, “నాకు సీబీఐ నోటీసు పంపింది. అయితే ఇదివరకే నేను కొన్ని కార్యక్రమాలు పెట్టుకొన్నాను కనుక ఐదు రోజుల తర్వాత ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని చెప్పాను.

ఈ కేసు విషయంలో ప్రజలందరికీ ఒక మాట చెప్పాలనుకొంటున్నాను. ఈ కేసుపై కోర్టులో విచారణ ప్రారంభించక మునుపే మీడియా నాపై విచారణ ప్రారంభించేసి తీర్పు కూడా చెప్పేసింది.

గత రెండున్నరేళ్ళుగా మీడియా, కొన్ని రాజకీయ శక్తులు కలిసి నాపై బురదజల్లుతూ నన్ను అప్రదిష్టపాలు చేస్తోంది. నాపై వచ్చిన ఈ ఆరోపణలని జీర్ణించుకోవడమే నాకు చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ నేను ఏనాడూ మీడియా ముందుకు వచ్చి సంజాయిషీ చెప్పుకోలేదు. ఎందుకంటే నేను ఎటువంటివాడినో కడప జిల్లా ప్రజలందరికీ తెలుసు. నేను ఒకటే కోరుకొంటున్నాను. ఎప్పటికైనా ఈ కేసులో నిజం అందరికీ తెలియాలి. న్యాయం జరగాలి,” అని అన్నారు.