Telugu movie Theatres Bandhసినిమా హాల్స్ లో డిజిటల్ ప్రొజెక్షన్ సేవలందిస్తున్న సంస్థలతో పలుమార్లు తాము జరిపిన చర్చలు విఫలం కావడంతో రేపటి నుంచి సినిమా ప్రదర్శనలను నిలిపివేయాలనే నిర్ణయించుకున్నామని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ డిజిటల్ కమిటీ చైర్మన్ దామోదర ప్రసాద్ స్పష్టం చేశారు. శుక్రవారం నుంచి సినిమాల ప్రదర్శన ఉండవది వర్చువల్ ప్రింట్ ఫీస్ (వీపీఎఫ్) చార్జీలను రద్దు చేయాలని తాము ఎంతగా విన్నవించుకున్నా డిజిటల్ సేవల సంస్థలు నిరాకరించాయని స్పష్టం చేశారు.

ఇప్పటివరకూ మూడుసార్లు కంపెనీలతో సమావేశమై తమ ఆలోచనలను పంచుకున్నామని, వారు ససేమిరా అన్నారని, ప్రొవైడర్ల తరఫున హాజరైన ఓ వ్యక్తి, “ఆల్‌ ది బెస్ట్‌ టు ద ఇండస్ట్రీ” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారని దామోదర ప్రసాద్ ఆరోపించారు. సినిమా పరిశ్రమపై ఆధారపడిన డిజిటల్ విభాగం, ఇలా ప్రవర్తించడం సమంజసం కాదని, అందుకే దక్షిణాదిన అన్ని రాష్ట్రాల సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపై నిలిచి థియేటర్ల బంద్ చేస్తున్నామని అన్నారు.

ముఖ్యంగా గత రెండు నెలల నుంచి డిజిటల్ ధరలు ఎంతో పెరిగాయని, డిజిటల్ సేవలు మొదలైన ఐదేళ్ల తరువాత వీపీఎఫ్ రద్దు కావాల్సి వుందని, ప్రపంచవ్యాప్తంగా ఇదే పద్ధతి ఉండగా, ఇండియాలో మాత్రం డిజిటల్ కంపెనీలు మాట వినడం లేదని ఆయన తెలిపారు. ఈ పోరాటానికి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల యాజమాన్యం పూర్తి మద్దతు పలికిందని, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఒకే మాటపై ఉన్నారని ఆయన వెల్లడించారు.