నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గురువారం టీటీడీపీ మహానాడును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ అధినేత అధ్యక్షడు చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. అయితే ఈ మహానాడుకు పార్టీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నరసింహులు డుమ్మా కొట్టారు.
తెలంగాణలో టీడీపీని బతికించుకోవడానికి టీఆర్ఎస్లో విలీనం చేయాలని గత మార్చి 18న మోత్కుపల్లి నరసింహులు చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు ఆయనను దూరంగా పెట్టారు. దీంతో మనస్తాపం చెందిన మోత్కుపల్లి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ చంద్రబాబు వైపు నుంచి ఎలాంటి సానుకూలత వ్యక్తం కాలేదు.
భువనగిరిలో జరిగిన మినీమహానాడులో కూడా మోత్కుపల్లి పాల్గొనలేదు. ఆయన అనుచరులు మోత్కుపల్లి లేకుండా జిల్లాలో మినీ మహానాడు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. దీనితో మోత్కుపల్లి పార్టీ మారడం లాంఛనమే అని అంతా అనుకుంటున్నారు. ఇదివరకే ఆయన పార్టీ మారాల్సివుండగా ఎన్డీయేతో పొత్తులో భాగంగా గవర్నర్ గిరి ఇస్తారేమో అని ఆశపడి ఉన్నారు.