మెగాస్టార్ చిరంజీవి ఇంటి నుండి రెండు లక్షల రూపాయలను సర్వర్ చెన్నయ్య దొంగిలించినట్లుగా వచ్చిన వార్తలు ప్రాధాన్యతను సంతరించుకున్న నేపధ్యంలో… అసలు ఈ డబ్బుతో చెన్నయ్య ఏం చేసారోనని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలను సర్వర్ చెన్నయ్య వివరించినట్లుగా తెలుస్తోంది.

చిరంజీవి ఇంట్లో తాను మొదటిసారి దొంగతనం చేయలేదని, గతంలోనూ చాలాసార్లు ఇదే పని చేశానని, ఇలా దొంగతనం చేసిన డబ్బులతో తాను రెండు చోట్ల ప్లాట్లు కొనుగోలు చేశానని చెప్పాడట. గతంలో వాటికి అడ్వాన్సులు ఇచ్చానని, ఇప్పుడు పూర్తి డబ్బు ఇవ్వాల్సి వచ్చినందున మరోసారి దొంగతనానికి ప్రయత్నించానని చెప్పినట్టుగా సమాచారం.

ఇక చెన్నయ్య వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు ప్లాట్ల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ కొనసాగుతోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే దొంగతనం చేసి మరీ రియల్ ఎస్టేట్ పై బిజినెస్ చేయడం ఇది నిజంగా ఊహించని పరిణామమే. ఈ పరిణామంతో మెగాస్టార్ కూడా అవాక్కవుతారేమో! ఇదే అవసరానికి మెగాస్టార్ ను అడిగితే ఆయనే ఇచ్చేవారేమో కదా!