వాన్పిక్ వ్యవహారంలో అరెస్టయిన ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ జైలు నుంచి విడుదలయ్యారు. సెర్బియాలోని బెల్గ్రేడ్ జైలు నుంచి విడుదలైన ఆయనకు అక్కడి న్యాయస్థానం షరతు విధించింది. సెర్బియా విడిచి వెళ్లరాదని నిమ్మగడ్డను ఆదేశించింది. ఆయనను ఈ కేసులో గరిష్టంగా ఏడాది పాటు నిర్బందించగలమని, ఈలోగా యూఏఈ ప్రభుత్వం ఆయనను తమ స్వాధీనంలోకి తీసుకోవచ్చని కోర్టు అభిప్రాయపడింది. ఇదే గనుక జరిగితే నిమ్మగడ్డను ఇబ్బందే.
వాన్పిక్ పోర్టు వ్యవహారానికి సంబంధించి రస్ అల్ ఖైమా (రాక్) దేశంలో నిమ్మగడ్డపై కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఆయనపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఉన్న సమయంలోనే ఆయన పలు దేశాలు వెళ్లి వెనక్కు రాగలిగారు. అయితే సెర్బియాలో అరెస్టు కావడంతో కంగుతిన్నారు. తీర ప్రాంత అభివృద్ధి పేరిట దివంగత సీఎం వైఎస్ హయాంలో 2005-2006లో వాన్పిక్ కోసం భూ సేకరణ చేపట్టడం జరిగింది.
ఇందుకుగాను గుంటూరు, ప్రకాశం జిల్లాలో దాదాపు 29 వేల ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు భూములు ఇవ్వడం కోసం అప్పట్లో అన్ని రూల్స్ నూ పక్కన పెట్టారట. అందుకు ప్రతిఫలంగా నిమ్మగడ్డ జగన్ కంపెనీలలో దాదాపుగా 850 కోట్లు పెట్టుబడి పెట్టారు. నాడు వైఎస్ జగన్తోపాటు మంత్రి మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ చేశారు. ఈ కేసులో సుమారు 16 నెలలకు పైగా జైలులోనే గడిపిన విషయం విదితమే. ఈ వివాదం వల్ల తాము నష్టపోయామని రస్ అల్ ఖైమా కేసు నమోదు చేసింది.