‘బిగ్ బాస్’తో తమిళ, తెలుగులో అగ్ర కథానాయకులు కమల్ హాసన్, జూనియర్ ఎన్టీఆర్లు వ్యాఖ్యాతలుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరి బాటలోనే దక్షిణాది చిత్రసీమలో నాలుగు దశాబ్దాలుగా మలయాళంలో స్టార్ హీరోగా కొనసాగుతోన్న ‘సూపర్ స్టార్’ మోహన్ లాల్ కూడా బుల్లితెర రంగప్రవేశం చేశారు. `లాల్ సలాం` పేరుతో ఓ టాక్ షోను హోస్ట్ చేస్తున్న మోహన్ లాల్, ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ కి మంచి స్పందన వచ్చింది.
ఇతర టాక్ షోల మాదిరి కాకుండా సమాజంలో మార్పులు తీసుకువస్తున్న వ్యక్తులను ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం జరుగుతోంది. సమాజ సేవ కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తున్న వ్యక్తులకు ఈ కార్యక్రమం ద్వారా ఓ గుర్తింపు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సంఘ సంస్కర్తలు, సామాజిక వేత్తలతో పాటు చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వాళ్లను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు.
మొదటి ఎపిసోడ్లో గాయని చిత్ర, మంజు వారియర్, టీపీ మాధవన్ వంటి ప్రముఖులు అతిథులుగా హాజరై అలరించారు. కేవలం వీకెండ్ లో భాగంగా ప్రతి శుక్ర, శని వారాల్లో అమృత టీవీలో ప్రసారమవుతోంది. సిల్వర్ స్క్రీన్ ను ఊపేసిన ఈ స్టార్ హీరో, బుల్లితెరపై ఏ రేంజ్ లో సందడి చేస్తాడన్నది అభిమానులు అత్యంత ఆసక్తికరంగా మారింది. మొత్తానికి స్మాల్ స్క్రీన్ కూడా స్టార్ హీరోలు చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా కనపడుతోంది.