MohanBabu turns idli hawkerమంచు లక్ష్మి నిర్వహిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమం కోసం ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సామాన్యుల బ్రతుకు జీవితంలోకి పరకాయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. తాజాగా తన తండ్రి మంచు మోహన్ బాబును కూడా అందులో భాగస్వామ్యం చేసింది. త్వరలో జెమిని టెలివిజన్ లో ప్రసారం కానున్న ‘మేము సైతం’ కార్యక్రమంలో భాగంగా మోహన్ బాబు రోడ్డు పైన ఇడ్లీలు అమ్మి డబ్బులు సంపాదించారు.

తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఎదురుగా రోడ్డు ప్రక్కన తోపుడు బండి వాళ్ళ మాదిరి ఇడ్లీలు అమ్మిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా వ్యాపించాయి. దాదాపు 500 సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషించిన ఈ రీల్ లైఫ్ హీరోకు ఈ పాత్ర బహుశా సరికొత్త అనుభూతిని పంచి ఉంటుందని చెప్పవచ్చు. మొత్తానికి కూతురు చేపట్టిన ఓ సేవా కార్యక్రమం కోసం తండ్రి రోడ్డున పడిన వైనం సామాన్యులను ఆకట్టుకుంటోంది. అతి త్వరలోనే ఈ కార్యక్రమం జెమిని టెలివిజన్ లో ప్రసారం కానుందని ప్రోమోలు కూడా ప్రారంభమయ్యాయి.