Mohan Babu goes Into Serialsపేపర్లు ఎక్కువ చదవనని, ఛానెళ్లలో వార్తలు ఎక్కువగా చూడనని… ఎందుకంటే, వాటిల్లో అన్యాయం, అక్రమం, మోసం, దగాలతో నిండిన వార్తలు ఉంటున్నాయని, అవి చూస్తే తనకు బీపీ వస్తుందని, అందుకే, సాధ్యమైనంత వరకు వాటి జోలికి వెళ్లనని ప్రముఖ నటుడు మోహన్ బాబు అన్నారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు రూపొందించిన ‘అభిషేకం’ సీరియల్ 2,500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన సెలెబ్రేషన్స్ లో మోహన్ బాబు మాట్లాడుతూ, ‘అన్యాయం జరిగితే నేను సహించలేను. పోరాడదామంటే, పక్కనున్న వాళ్లు ‘నీకు ఎందుకులే’ అంటుంటారు. అలా అనుకున్నట్లయితే, గాంధీ మహాత్ముడు, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అన్నయ్య నందమూరి తారక రామారావు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు, మన కేసీఆర్ గారు రారు. సమాజం కోసం పోరాడాలి’ అని మోహన్ బాబు అన్నారు.

‘టీవీ ఆర్టిస్టులందరికి నా హృదయ పూర్వక అభినందనలు. అసలు టీవీ నటులు ఒక నటులేనా? అని కొందరు అనుకుంటూ ఉంటారు. అలా ఎవరైతే అనుకుంటారో వాళ్లే నటులు కాదు. ముందు ఎవరికైనా ఒక వేదిక కావాలి. అక్కడ మన ప్రతిభ కనబరచాలి. ఆ స్టేజ్ పై కలం పని చేసింది కాబట్టే దాసరి నారాయణరావు గారు, మా గురువు గారు ఇంతటి గొప్ప వ్యక్తి అయ్యారు. మా రోజుల్లో వీధి నాటకాలు ఉండేవి.

టీవీ ఆర్టిస్టులంటే నాకు ఎంతో గౌరవం, ప్రేమ. ఎందుకంటే, టీవీ షోలలో నటించాలని నేనూ అనుకునేవాడిని. కానీ, ఓపిక, సమయం లేక, పని ఒత్తిడి వల్ల చేయలేకపోయాను. అయినా మంచి కథ ఉంటే టీవీ సీరియల్స్ లో నటించాలనే కోరిక మాత్రం ఇంకా ఉందని, భవిష్యత్తులో తన ఆకాంక్ష నెరవేరుతుందని భావిస్తున్నానని ‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు పేర్కొన్నారు.