ఇటీవల కాలంలో ఏ టీమిండియా క్రికెటర్ లేనంతగా, వార్తల్లో నిలిచిన ఫాస్ట్ బౌలర్ షమీకి యాక్సిడెంట్ జరగడం కలవరపెడుతోంది. షమీ సతీమణి చేసిన ఆరోపణల రీత్యా, తాను మానసికంగా కృంగిపోయానని, ముఖ్యంగా మ్యాచ్ ఫిక్స్ చేసానంటూ చేసిన ఆరోపణలు నన్ను బాగా బాధించాయని, అయితే బీసీసీఐ విచారణలో తన నిర్దోషిత్వం బయట పడినందుకు సంతోషమని చెప్పిన షమీ, ఇక ఐపీఎల్ పై దృష్టి పెడతానని, మరింతగా రాణిస్తానని ఆత్మ విశ్వాసం వ్యక్తం చేసాడు.
ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే షమీ యాక్సిడెంట్ కు గురి కావడం టీమిండియా అభిమానులను ఆందోళన చెందేలా చేస్తోంది. డెహ్రాడూన్ నుండి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో షమీ తలకు గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. డెహ్రాడూన్ లోని ఆసుపత్రిలో జరిగిన చికిత్సలో భాగంగా షమీ తలకు కుట్లు పడ్డాయి. అయితే జరిగిన ప్రమాదంలో షమీ స్వల్ప గాయాలతో బయట పడడం ఊరట చెందే విషయం. దీనికి సంబంధించిన మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.