modi-cry-goa-speech-brokeప్రస్తుతం గోవా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, నల్లధనంపై తాను తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయం గురించి మాట్లాడుతున్న వేళ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సమయంలో తన కంటి నుండి వచ్చిన కన్నీరును మోడీ తుడుచుకోవడం, అందరి హృదయాలనూ బరువెక్కించింది. దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న మోడీ, తన పుట్టుక నుండి పదవి వరకు క్లుప్తంగా వివరిస్తూ భావోద్వేగం చెందారు.

“నేనేమీ అత్యున్నత పదవిని అనుభవించేందుకు పుట్టలేదు. పుట్టుకతోనే నా వద్ద డబ్బు లేదు. అధికారం లేదు. దేశ ప్రజల కోసం కుటుంబాన్ని, ఇంటిని కూడా త్యాగం చేశాను. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం దేశ వ్యవస్థలో ఎలాంటి మార్పును తీసుకువస్తుందో నాకు తెలుసు. కొంతకాలం ఆగితే, దాని ప్రభావం ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. నాపై నమ్మకంతో కోట్ల మంది అండగా నిలిచారు. ఏమిచ్చి ప్రజల రుణం తీర్చుకోగలను?” అని మోడీ కీలక వ్యాఖ్యలు చేసారు.

ఆభరణాల కొనుగోలుకు పాన్ కార్డును తప్పనిసరి చేయవద్దని ఎంతో మంది ఎంపీలు తనను కోరారని, అయినా తాను వినలేదని చెప్పిన మోడీ దాదాపు 10 నెలల నుంచే పెద్ద నోట్ల రద్దు ఆలోచన చేసినట్టు తెలిపారు. మొత్తానికి నల్లధనం నియంత్రణ విషయంలో ప్రధాని మోడీ చిత్తశుద్ధి ఏమిటో తెలిసి వచ్చినట్లయ్యింది. తన సన్నిహితులకు సమాచారం ఇచ్చారన్న ప్రతిపక్షాల విమర్శల నేపధ్యంలో మోడీ కన్నీరు పర్యంతం కావడం ప్రాధాన్యతను దక్కించుకుంది.