అసెంబ్లీ సమావేశాలంటే సాధారణంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక అనేది ఒకప్పటి నానుడి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే ఎన్నికైన అధికార పార్టీ సభ్యులంతా వారి అధినాయకుడికి భజన చేసే పనిలో నిమగ్నమై ప్రజాసమస్యలను పక్క దారి పట్టిస్తున్నారన్నది సామాన్యుడి ఆవేదన. మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందనే జగన్ ప్రకటనతో అప్రమత్తమైన ఎమ్మెల్యేలు తమ అధినేతను ప్రన్ననం చేసుకొనే పనిలో ఉన్నట్టుంది అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే.
“మనసున్న మహారాజుగా.., మనసెరిగిన మహానాయకుడిగా., మనందరి రారాజుగా., ఈ రాష్ట్రానికి రాజుగా” అంటూ భజన మొదలుపెట్టి ఎప్పుడో అంతరించిపోయిన రాజరికాన్ని ఏపీ ప్రజలకు గుర్తుచేస్తున్నారు వైసీపీ నేత ధర్మశ్రీ. ఇక రోజా వంతు అన్నట్టుగా ఈమె ఏకంగా అశోకుడితో పోల్చి జగన్ ప్రజానాయకుడే కాదు యుగ పురుషుడు కూడా అంటూ చిడతలు వాయించిందని టీడీపీ సభ్యులు వాపోయారు.
యుగపురుషుడంటే కూల్చివేతలు., విధ్వంశాలు., హత్య రాజకీయాలు., ప్రజా వ్యతిరేక విధానాలు., అక్రమాలు., అవినీతి కేసులలో జైలుకు వెళ్లడం అనుకుంటున్నావా రోజా అంటూ టీడీపీ సోషల్ మీడియాలో రోజా మీద సెటైర్లు పేలుతున్నాయి. తరువాత వరుసలో జోగి రమేష్ ముందుకొచ్చి బలహీనుడి పక్షాన బలమైన నాయకుడు మన జగనన్న ఉన్నారంటూ ఇక బలహీనుడికి న్యాయం అందుబాటులో ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఎక్కడ తగ్గేదేలే అన్నట్లుగా సోషల్ మీడియాలో ట్రోలర్స్ కూడా అంతే దూకుడుగా ప్రతిస్పందిస్తునారు. బలహీనుడి పక్షాన తరువాత ఉందువు కానీ బాబాయ్ హత్య నిందితులను పట్టుకుని ముందు చెల్లికి న్యాయం చేసి అన్నగా తన బాధ్యతను నిలబెట్టుకోవాలని చురకలు అంటించారు జోగి రమేష్ కు.
నా గుండె ఎప్పుడు లబ్-డబ్ అని కాకుండా జగన్ – జగన్ అంటూ కొట్టుకుంటుందని పాపులర్ అయిన విడుదల రజని కూడా అసెంబ్లీ లో తనకు దక్కిన విలువైన సమయాన్ని ఇదే పంధాలో వినియోగించింది. అధికారంలోకి వచ్చిందే మొదలు జగన్ సంక్షేమ సామ్రాజాన్ని సృష్టించారని తెలిపారు. సంక్షేమం అంటే వ్యాపారాలను విచ్ఛినం చేయడమా? లేక కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలను హరించడమా..? చెప్పాలి రజనీ గారు అంటూ ట్రోల్స్ తో రెచ్చిపోతున్నారు నెటిజన్స్.
వైసీపీ నాయకుల భజన కార్యక్రమాన్ని ఆసాంతం ఏంతో ఆసక్తిగా గమనిస్తూ., మంత్రి పదవి కోసం వారు పడుతున్న తంటాలను చూస్తూ జగన్ ముసి ముసి నవ్వులు చిందిస్తూ., ఇక్కడ ఎవ్వరు తగ్గట్లా అన్నట్లు ముఖ కవళికలు మారుస్తున్నారు. ప్రజా ఓటుతో చట్ట సభలో అడుగుపెట్టి ప్రజల పక్షాన తమ గళాన్ని వినిపించాల్సిన నేతలు ఇలా ముఖ్యమంత్రి భజన బృందాలుగా మారి తమ పదవులను నిలుపుకోవచ్చు లేక కొత్తగా పదవులను పొందవచ్చు కానీ ఓటరు దృష్టిలో ఎంత హీన స్థితికి దిగజారిపోతారో ఒక్క సారి అలోచించి మెసలుకోవాలని సూచనలు చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.