జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అదుపు తప్పుతున్నట్టుగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ధిక్కార స్వరం తట్టుకోలేని నాయకులు అదుపు తప్పి మాటలు తూలుతున్నారు. హద్దులు ధాటి పర్సనల్ విషయాలకు వెళ్తున్నారు. ఇప్పటికే పవన్ చంద్రబాబు డిఎన్ఏ ఒకటే, దత్తపుత్రుడు అంటూ వ్యాఖ్యలు చేసి తాజాగా మరింతగా చెలరేగిపోయారు.
వైసీపీ సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు పవన్కు ఒక చేతిలో తాళి.. మరొక చేతిలో ఎగతాళి ఉంటుందని.. తాళి ఎప్పుడు కడతారో, ఎవర్ని ఎప్పుడు ఎగతాళి చేస్తారో ఆయనకే తెలియదన్నారు. ఓడిపోయిన పవన్ సిగ్గులేకుండా రాజకీయాలు చేస్తున్నారన్నారు. పవన్.. కార్పొరేటర్కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అన్నారు.
గతంలో ఎన్నికల సమయం అప్పుడు జగన్ కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పై విమర్శలు చేశారు. అప్పట్లో పెద్ద వివాదానికి దారి తీశారు. ఇప్పుడు గౌరవప్రదమైన ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తమ పార్టీ నాయకులను ఇటువంటి చిల్లర కామెంట్లు చెయ్యకుండా నిలువరించకపోతే అది జగన్ కు అంత శ్రేయస్కరం కాదు.
మరోవైపు ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పోటీ పడి పవన్ కళ్యాణ్ ను దూషిస్తున్నట్టు కనిపిస్తుంది. రెండున్నర ఏళ్లకు కేబినెట్ మారుస్తా అని జగన్ చెప్పడంతో నేతలందరూ పోటీ పడి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అయితే విమర్శలు హేతుబద్ధంగా ఉంటె ప్రజలు కూడా హర్షిస్తారు.