రాను రాను అమరావతిలో పర్యటించడం అధికార పార్టీ నేతలకు ఇబ్బందిగా మారుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం భారీ బందోబస్తు మధ్య సచివాలయానికి వెళ్లాల్సి వస్తుండగా, మిగిలిన నేతలకు తిప్పలు తప్పడం లేదు. తాజాగా ఏపీఐఐసి చైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజాకు రైతుల నిరసన సెగ తగిలింది.
నీరుకొండ ఎస్ఆర్ఎం వర్సిటీ సమ్మిట్లో పాల్గొనేందుకు రోజా అమరావతి వెళ్లగా అక్కడ ఆమెను రైతులు అడ్డుకున్నారు. అమరావతికి న్యాయం చేయాలంటూ ఆమెను అడ్డుకుని, ఆమె వాహనం ముందు బయటాయించారు. రోజా రైతులను పైడ్ ఆర్టిస్టులు అనడంపై నిరసన వ్యక్తం చేశారు. తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
విషయం తెలిసిన పోలీసులు అక్కడకు భారీగా చేరుకున్నారు. వారి సాయంతో రోజా ఎస్ఆర్ఎం యూనివర్సటీ సమ్మిట్లో పాల్గొన్నారు. విషయం తెలిసిన మహిళలు అక్కడకు చేరుకుని సమ్మిట్ బయట ఆందోళనకు దిగారు. అమరావతికి న్యాయం చేయాలంటూ మహిళలు నినాదాలు చేశారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు రోజాను వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మహిళలు రోజా కాన్వాయ్ను వెంబడించారు. ఈ ఘటనతో యూనివర్సిటీ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పర్యటన ఆసాంతం నిరసనలు వ్యక్తం కావడంతో రోజా స్థానిక పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.