ఇటీవలే టీడీపీని వదిలి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. టిడిపి నేతలందరిని టిఆర్ఎస్ లో చేర్చే వరకు పార్టీ అద్యక్షుడు ఎల్ .రమణ టిడిపిలోనే కొనసాగుతారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీలో ఉంటూ కేసీఆర్కు ఉపాధి కూలీ పని చేస్తున్నవారికి నేను చెప్పాల్సింది ఏమీ లేదన్నారు.
తన గురించి మాట్లాడుతున్న రమణ కంచర్ల భూపాల్రెడ్డి టీఆర్ఎస్లో చేరితే ఎందుకు మాట్లాడలేదు అని రేవంత్ ప్రశ్నిస్తున్నారు. “కేసీఆర్ దగ్గర డబ్బులు తెచ్చుకుని ఎల్ రమణ నాపై విమర్శలు చేస్తున్నారు. కొడంగల్లో సమావేశం పెడతా అంటున్న రమణ…గజ్వేల్, సిద్ధిపేట్లో సమావేశం పెడతా అని ఎందుకు చెప్పడం లేదు,” అని రేవంత్ అన్నారు.
అయితే టీడీపీ నుండి బయటకి వస్తూ తనతో పాటు పార్టీ మారమని ఏ ఒక్కరినీ కోరలేదని ఆయన అన్నారు. తాను చెప్పాలనుకున్నది చంద్రబాబు నాయుడుకు చెప్పే వచ్చానని ఆయన తెలిపారు. మరోవైపు రేవంత్ రెడ్డి రాజీనామాపై సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఇప్పటికి ఆ లేఖ తమకు చేరలేదని స్పీకర్ కార్యాలయం చెబుతుంది.