విపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర నేడు పశ్చిమ గోదావరిలోకి ప్రవేశించింది. ఏలూరు మండలం లింగారావుగూడెంలో కొనసాగుతోంది. అయితే ఇదే సమయంలో అటుగా వచ్చిన ప్రభుత్వ చీఫ్ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ పాదయాత్ర ర్యాలీలో చిక్కుకున్నారు.
చింతమనేని రాకతో పాదయాత్రకు భద్రతలో ఉన్న పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అయితే చింతమనేని తన వద్దనున్న చాక్లెట్లను వైసీపీ కార్యకర్తలకు పంచి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. పాదయాత్రకు వచ్చిన వైసీపీ కార్యకర్తలు, ప్రజలతో సరదాగా సంభాషిస్తూ వారికి చాక్లెట్లు పంచి పెట్టారు.
మాములుగా ఫైర్ బ్రాండ్ లా ఉండే చింతమనేని చిరు నవ్వులు చిందిస్తూ పైగా ఎవరి కార్యక్రమాలు వారివేనంటూ వ్యాఖ్యానించారు. పాదయాత్రలో చిక్కుకున్న చింతమనేని బైటికివెళ్లే క్రమంలో ఈ విధంగా చాక్లెట్లు పంచి వైసీపీ కార్యకర్తలకు ఉత్సాహాన్నిచ్చారు. దీనితో అక్కడ ఉన్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.