జనసేన పార్టీ మూడు రాజధానుల బిల్లుల ఆమోదంపై ఆచితూచి స్పందించింది. బీజేపీ లైన్ బట్టో మరొకటో తెలీదు గానీ దాని మీద స్పందించకుండా… కరోనా టైం లో మూడు రాజధానుల డిస్కషన్ అనవసరమని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లెటర్ హెడ్ మీద ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారు.
అయితే దానిని కూడా తట్టుకోలేకపోతున్నారు అధికార పార్టీ వారు. ఆ పార్టీపై రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన పెనుకొండలో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జనసేన జనం కోసం చేసింది సూన్యమని… అది ఒక పనికిమాలిన సేన అని విరుచుకుపడ్డారు.
ప్యాకేజి కోసం పనిచేయడం తప్ప ప్రజల కోసం చేసింది సూన్యమని ఆరోపించారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు సరైన సమయం కాదు అన్న పవన్ కళ్యాణ్కు… షూటింగ్లకు సరైన సమయమా అని ప్రశ్నించారు. ఏదో విమర్శించడానికి చేసిన కామెంట్లు గానీ పవన్ కళ్యాణ్ షూటింగ్ ఎక్కడ చేస్తున్నాడు?
పైగా ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో కరోనా పూర్తిగా పోయేవరకు షూటింగ్లు మొదలు పెట్టే పరిస్థితి లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఇది ఇలా ఉండగా.. తమకు అండగా నిలబడతా అని ఇప్పుడు మాట మారుస్తున్నారని జనసేనాని మీద ఆందోళన చేస్తున్న రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు.