paritala-ravi-reactionఅనంతపురం జిల్లా రాప్తాడులో ఒక పీజీ విద్యార్థిని ఓబులేష్ అనే రౌడీషీటర్ వేధించిన సంఘటనలో… సదరు ఓబులేష్ ను నగేష్ చౌదరి అనే వ్యక్తి దారుణంగా చితకబాదిన సంఘటన ఇటీవల జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో, న్యూస్ ఛానెళ్లలో ప్రసారమైన విషయం తెలిసిందే. అయితే, సదరు విద్యార్థిని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ అని ప్రచారం జరిగింది.

పరిటాల శ్రీరామ్ అండతోనే ఈ విధంగా నగేష్ చౌదరి ప్రవర్తించాడనే విమర్శలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఒక మీడియా ఛానెల్ తో మాట్లాడిన పరిటాల శ్రీరామ్… “నగేష్ చౌదరి వెనుక మేమున్నామనే విషయం ముఖ్యం కాదు. అది వ్యక్తిగత విషయం. ఆ రోజు వాళ్లు రియాక్ట్ అవడానికి కారణం వారి వెనుక ఎవరో ఉన్నారని కాదు. ఈ సంఘటనపై లోతుగా ఆలోచిస్తే అన్ని తెలుస్తాయి. అందరిలాగే మేము చట్టాన్ని గౌరవిస్తాం. చట్టాన్ని గౌరవించద్దంటూ మేమేమి క్లాసులు పెట్టి చెప్పట్లేదంటూ” వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకోవాల్సిందిగా కోరారు.

“ఈ సంఘటనలో నగేష్ చౌదరి రియాక్ట్ అయిన పద్ధతి కరెక్టని నేను చెప్పను. అయితే, వాళ్లు ఎంత బాధతో ఉంటే, ఆ అమ్మాయిని ఎంతగా వేధిస్తేనో ఆ విధంగా వాళ్లు రియాక్ట్ అయి ఉంటారో మనం ఆలోచించాలి. ఇంట్లో ఆడపిల్లలను ఎవరైనా వేధిస్తే నేనైనా అలానే రియాక్ట్ అవుతాను. అది నా క్షణికావేశం కావచ్చు, ఆవేశం కావచ్చు, ఆలోచన కావచ్చు” అని సమాధానం చెప్పాడు.

“అమ్మాయిల్ని వేధించిన వారెవరైనా మీ దగ్గరకు వస్తే మీ ప్రైవేట్ సైన్యంతో సమస్యను పరిష్కరిస్తారా?” అన్న ప్రశ్నకు “ప్రైవేట్ సైన్యంతో కాదు అమ్మాయిలతోనే సమస్యను పరిష్కరిస్తాను. తప్పు జరిగినప్పుడు ప్రైవేట్ సైన్యం పెట్టి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం లేదు. అమ్మాయిలు వాళ్లకు వాళ్లు రియాక్ట్ అయ్యేటట్లు, మహిళా సంఘాలు రియాక్ట్ అయ్యేటట్లు, పోలీసులు స్పందించేటట్లు చేసేందుకు మా సపోర్ట్ కచ్చితంగా ఉంటుందని” చెప్పుకొచ్చారు.