దేశంలోని అత్యంత ధనవంతులైన మంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ ప్రథమ స్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించారు. ఏపీకి చెందిన మరో 20 మంది మంత్రులు కూడా ఈ జాబితాకెక్కడం గమనార్హం. ఈ మంత్రుల సరాసరి ఆస్తుల విలువ 45.49 కోట్లు కాగా, ఒక్క నారాయణ మొత్తం ఆస్తి విలువ 496 కోట్లుగా తేలింది. అత్యధిక ఆదాయం కలిగిన మంత్రుల్లో కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ 251 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు.
ఇక మంత్రులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలవడం గమనార్హం. పలు రాష్ట్రాలకు చెందిన 210 మంది మంత్రులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 113 మంది అమాత్యులపై కిడ్నాప్, హత్య కేసులు ఉన్నాయి. ఈ విషయంలో మహారాష్ట్ర 18 మందితో టాప్లో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో బీహార్ 11, జార్ఖండ్ 9, తెలంగాణ 9, ఢిల్లీ 4, ఉత్తరాఖండ్ ఇద్దరు ఎమ్మెల్యేలతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
కర్ణాటకలో ముగ్గురు అమాత్యులు తప్ప మిగతా అందరూ కోటీశ్వరులే కావడం గమనార్హం. అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్, పుదుచ్చేరి మంత్రులందరూ కోట్లకు పడగలెత్తినవారే. మధ్యప్రదేశ్, తమిళనాడు చెందిన 51 మంది మహిళా మంత్రులు కోటీశ్వరుల జాబితాలో ఉన్నారు. ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) అనే సంస్థ దేశంలోని 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మంత్రుల ఆదాయంపై చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.