మీడియా వర్గాల ద్వారా చంద్రబాబు క్యాబినెట్ లోని మంత్రుల పనితీరుపై వెలువడిన ర్యాంకింగ్స్ పై మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. ఈ ర్యాంకులన్నీ తప్పుడు తడకలని, అవి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించినవి కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ సర్వేలను ఎవరు, ఏ ప్రాతిపదికన తయారు చేశారో తనకు తెలియదని, చిత్తూరు జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా ఐదో ర్యాంకు తనకు రాగా, చిట్టచివరన ఉన్నట్టు ఎందుకు ప్రకటించారో తెలియడం లేదని అన్నారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం, తాను ఐదో ర్యాంకులో ఉన్నానని, ఇవే చంద్రబాబు క్యాబినెట్ లో అసలు ర్యాంకులని అన్నారు. తుళ్లూరు మండలం వెలగపూడిలో నిర్మాణం అవుతున్న తాత్కాలిక సచివాలయం పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో వ్యాఖ్యానించిన నారాయణ సదరు వ్యాఖ్యలు చేసారు. ఇక, సచివాలయ నిర్మాణం విషయంపై స్పందిస్తూ… ఈ నెల 25లోపు అన్ని భవనాల్లోని మొదటి అంతస్తు శ్లాబులను పూర్తి చేస్తామని, ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించామని, వారానికి 5 రోజుల పని దినాలకు సీఎం అంగీకరించారని, ‘స్థానికత’ అంశంపై నేడో, రేపో నిర్ణయం వెలువడుతుందని తెలిపారు.