samantha-memu-saithamకిడ్నీ సమస్యతో బాధపడుతున్న వ్యక్తిని ఆదుకునేందుకు ‘మేము సైతం’ కార్యక్రమంలో పాల్గొన్న సమంత, అవసరమైన నిధులు సేకరించేందుకు బాచుపల్లిలోని ఒక మహిళా కళాశాలకు వెళ్లింది. గర్ల్స్ కాలేజీకి వెళ్తానని సమంత చెప్పగానే, ఆశ్చర్యానికి గురైన మంచు లక్ష్మి, బాయ్స్ కాలేజీకి వెళ్తే డబ్బులొస్తాయని అంటావని భావించానని అనగా, సమంతా నవ్వుతూ… తనకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ అని తెలిపింది.

ఆ కళాశాలలో దాదాపు గంటన్నర సేపు గడిపిన సమంత, 60 వేల రూపాయలు వారి నుంచి సేకరించింది. కాలేజ్ లోని యువతులు తనను హగ్ చేసుకోవడంతో ఆశ్చర్యానికి గురయ్యానని, కొంత షాక్ కు కూడా లోనయ్యానని, వచ్చిన మొత్తంలో నుండి సామాన్లు కొనేందుకు ఖర్చైన 10 వేల రూపాయలు తీసేయగా, మిగిలిన 50 వేల రూపాయలకు మరో మూడు రెట్లు వేసి 2 లక్షల రూపాయలు ఇచ్చింది. అలాగే తమ ఎన్జీవో ప్రత్యూష నుంచి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తానని చెప్పింది. దీంతో సదరు కుటుంబానికి ఓ 3 లక్షల రూపాయలు సాయం అందింది.

ఈ ప్రత్యూష ఫౌండేషన్ గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది సమంత. “తన జీవితం పూలపానుపు కాదని, తాను బాగా డబ్బున్న కుటుంబం నుంచి రాలేదని, లోయర్ మిడిల్ క్లాస్ లో ఉన్నప్పటికీ తన తల్లి పేదరికాన్ని ఏనాడూ సమస్యగా భావించలేదని, అంత లోటులో కూడా ఆపన్నులకు సహాయం చేసేదని, తనను కూడా అలా చేయమని చెప్పేదని, ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు సుఖాలు ఉంటాయని, వాటిని అధిగమించి జీవించడమే జీవిత పరమార్థమని” చెప్పుకొచ్చింది.

“తాను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని, దీంతో తన కుటుంబం మొత్తం తనపై ఆధారపడి ఉందని, అలాగే ప్రతి ఒక్కరికీ కుటుంబ బాధ్యతలు ఉంటాయని, వాటిని సక్రమంగా నిర్వర్తించాలని, కష్టాలకు వెరవకూడదని మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే, 2012లో సంభవించిన ఘటన తన ఆలోచనలను మార్చివేసిందని, తన జీవితంలో చోటుచేసుకున్న ఓ సంఘటనతో మూడు నెలల పాటు తీవ్ర నిరాశలో కూరుకుపోయానని తన కష్టాలను కూడా వివరించింది.

అప్పుడు తానేం చేస్తున్నానని ఆలోచించానని, తాను జీవిస్తున్న విధానం సరైనదేనా అని అవలోకనం చేసుకున్నానని… అప్పుడే తాను ఉన్నా లేకున్నా తన తల్లి చెప్పిన మాట మాత్రం బతకాలని భావించానని, అందుకే ప్రత్యూష ఫౌండేషన్ ను ప్రారంభించానని, దాని ద్వారా చేతనైనంత సాయం చేస్తున్నానని సమంత తెలిపింది.