Mekapati Chandrasekhar Reddyఇంతకాలం నెల్లూరు వైసీపీలో చక్రం తిప్పిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ చేశారంటూ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో, ఇంతకాలం ఆయనపై కత్తులు దూయలేక ఇబ్బందిపడిన నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ యాదవ్, ఇప్పుడు ఆయనపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. తల్లి లాంటి వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేసిన మేకపాటి ఉదయగిరిలో మళ్ళీ కాలు పెడితే తరిమి తరిమి కొడతానంటూ హెచ్చరించారు. ఇప్పటికే ఓసారి అనిల్ కుమార్‌ యాదవ్‌కు తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఈ మాట విని ఆగ్రహంతో రగిలిపోయారు.

గురువారం ఉదయం తన అనుచరులతో కలిసి ఉదయగిరిలో బస్టాండ్ వద్దకు చేరుకొని అక్కడ రోడ్డుపై కుర్చీవేసుకొని మీడియా ద్వారా అనిల్‌కు సవాల్ విసిరారు. “నువ్వేదో పెద్ద పోటుగాడిననుకొంటున్నావేమో… ఇదిగో ఉదయగిరికి వచ్చా… ఇక్కడే కూర్చొని ఎదురుచూస్తున్నా… దమ్ముంటే రండి ఎవరొస్తారో…ఏం చేస్తారో… నేను చూస్తాను. ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న మీరందరూ ఒకప్పుడు నా కాళ్ళదగ్గర పడి బ్రతికేవారనే సంగతి అప్పుడే మరిచిపోయారా? దమ్ముంటే రండి… నేను ఇక్కడే మీకోసం ఎదురుచూస్తుంటాను.

నన్ను ఎవరనుకొంటున్నారు మీరు? మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ! నా గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడితే నేను కాదు ముందు జనాలే మీ నోరు మూయిస్తారు జాగ్రత్త. వచ్చే ఎన్నికలలో నేను గెలవనని చెపుతున్నావు. ముందు నువెన్ని ఓట్లతో గెలిచావో గుర్తు చేసుకో. 60 వేలకు పైగా మెజార్టీతో గెలిచిన నేనెక్కడ సింగిల్ డిజిట్‌తో గెలిచిన నువ్వెక్కడ? గత ఎన్నికలలో మా అందరి సాయంతో గెలిచావు. వచ్చే ఎన్నికలలో అడ్రస్ లేకుండా పోతావు గుర్తుంచుకో. ఒకవేళ నువ్వు గెలిస్తే నేను రాజకీయాలనుంచి తప్పుకొంటాను. నేను గెలిస్తే నువ్వు తప్పుకొంటాన్నావు కదా? అందుకు సిద్దంగా ఉండు. నేనే కాదు… ఆనం రామనారాయణ రెడ్డి, కోటగిరి శ్రీధర్ రెడ్డి కూడా గెలుస్తారు. కానీ ముందు మాతో పోటీ చేయడానికి నీకు మీ జగన్న టికెట్‌ ఇస్తారో లేదో తెలుసుకో. ఎందుకంటే ఈసారి నీకు టికెట్‌ రాదని విన్నాను,” అంటూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనిల్ కుమార్‌ యాదవ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.