Megastar Chiranjeevi hurt as politician‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ సిల్వర్ స్క్రీన్ పై మెగా సందడి సృష్టిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి, బుల్లితెరపై కూడా ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. అందులో భాగంగానే రాజకీయాలలో తనకు జరిగిన అవమానాల గురించి కూడా ప్రస్తావించారు. పదేళ్లు రాజకీయాల్లో ఉండగా ఎన్నో ప్రశంసలు, విమర్శలు చూశానని, కానీ ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా షూటింగ్ స్పాట్ లోకి వెళ్లిన తరువాత, లైట్స్, సౌండ్, యాక్షన్ అన్న మాటలు విన్న తరువాత… ‘వాహ్…ఇది కదా మన సామ్రాజ్యం!, దీనినా నేను ఇన్నాళ్లు మిస్సయింది?’ అనిపించిందని తెలిపారు.

అప్పుడు తొలిసారి ఈ రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా? అన్న ఆలోచన వచ్చిందని, అయితే ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేసే భాగ్యం అతి కొద్ది మందికే లభిస్తుందని, అలా నిజాయతీగా సేవ చేసినప్పుడు లభించే ఆనందం మాటల్లో వర్ణించలేమని అందుకోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లుగా తెలిపారు. విభజన సమయంలో అప్పటి నేతలంతా కలిసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి… రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దని కోరినప్పుడు, విభజన ఆపలేమని తెలిసినప్పుడు కనీసం హైదరాబాదును యూటీని చేయండంటూ తీవ్రంగా ప్రయత్నిస్తే తనకు అనేక అవమానాలు ఎదురయ్యాయని భావోద్వేగం చెందారు.

కొత్తగా యూటీ అంటాడు, అయినా వీడేం చేశాడని కొంత మంది అడిగారని, మరి కొందరు తన ఇంటి బయట చీర, గాజులు పెట్టి అవమానించారని, ఇంకొందరు కాకినాడలో అసభ్యకరమైన ఫోటోలు పెట్టి విమర్శించారని గుర్తు చేసుకున్నారు. ఇంత నిజాయతీగా ప్రజల కోసం పోరాడితే మనకు లభించే సన్మానం ఇదా? ఇలాంటప్పుడు రాజకీయాలు అవసరమా? అనిపించిందని ఆవేదన చెందారు. అలాంటప్పుడు చాలా బాధవేసిందని, గుండెను మెలిపెట్టినట్టు అనిపించిందని తన అప్పటి భావాలను ఇప్పుడు బయటపెట్టారు.