Mega fans irritates Director Krishna Vamsi అభిమానులు హద్దులు దాటుతున్నారా? లేదా అభిమానం ముసుగులో కొంతమంది ఆకతాయిలు సినీ వేడుకలకు విచ్చేసి కావాలనే సెలబ్రిటీలను వేధిస్తున్నారా? వీటికి సమాధానం కావాలంటే దొరకకపోవచ్చు గానీ, మెగా హీరోలు పాల్గొన్న ప్రతి సినీ వేడుక ఏదొక రూపంలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుండడం విశేషం. తాజాగా జరిగిన “నక్షత్రం” ఆడియో వేడుకలో మెగా అభిమానులు చేసిన రచ్చతో దర్శకుడు కృష్ణవంశీ బహిరంగంగానే అసహనం వ్యక్తం చేయడం విశేషం.

‘సందీప్ కిషన్ గురించి రెండు ముక్కలు మాట్లాడాలి’ అంటూ మైక్ తీసుకున్న కృష్ణవంశీని మాట్లాడనివ్వకుండా… ‘సుప్రీం హీరో… సుప్రీం హీరో…’ అంటూ మెగా ఫ్యాన్స్ కేకలు పెట్టారు. ఒక రెండు నిముషాలు ఆపాల్సిందిగా కృష్ణవంశీతో సహా హీరో సందీప్ కిషన్ చెప్పినప్పటికీ వినిపించుకోకుండా, రెట్టించిన ఉత్సాహంలో కేకలు పెట్టిన వైనం ఇబ్బందికరంగా మారింది. దీంతో సాయి… మీ ఫ్యాన్సే అనుకుంటా… కావాలనే సాయినే ఇలా చేయిస్తున్నాడా… అంటూ ఛలోక్తి విసిరినా గానీ, దీని వెనుక కృష్ణవంశీ విరక్తి ఉందన్న విషయం స్పష్టం.

దీంతో మైక్ తీసుకున్న హీరో సందీప్ కిషన్, నా గురించి కృష్ణవంశీ అంతటి వ్యక్తి ఓ రెండు ముక్కలు బహిరంగంగా పొగుడుతానంటున్నారు… ఒక రెండు నిముషాలు ఆగండి… అంటూ విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రయోజనం లేదు. దీంతో కృష్ణవంశీ అసలు మాట్లాడకపోగా, సందీప్ కిషన్ ఓ రెండు ముక్కలు మాట్లాడారు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడినపుడు మాత్రం ఈ సౌండ్ భారీగానే ఉండడంతో, గోల చేసిన వ్యక్తులు మెగా ఫ్యాన్స్ అన్న విషయం ఖరారైంది. బన్నీ మాట్లాడానికి, వీరు చేయడానికి సరిపోయింది అన్నట్లుగా తయారైంది మెగా ఫ్యాన్స్ పరిస్థితి.