meelo-evaru-koteeswarudu-telugu-movie-teaser‘కింగ్’ నాగార్జున పుణ్యమా అంటూ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే టైటిల్ ప్రేక్షకుల్లోకి బాగా దూసుకెళ్లింది. తాజాగా అది కాస్త మెగాస్టార్ చిరంజీవి వశం కావడంతో, ఆ టైటిల్ మరింత బలంగా మారింది. అయితే ఈ టైటిల్ తో మరో కమెడియన్ కం నటుడు పృధ్వీ హీరోగా మారబోతున్నారు. “మీలో ఎవరు కోటీశ్వరుడు” పేరుతో తెరకెక్కుతోన్న సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.

పృధ్వీకి జంటగా సలోని నటించగా, ‘అందాల రాక్షసి’ ఫేం నవీన్ చంద్ర, ‘పటాస్’ ఫేం శృతి సోది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ శీను, ధనాధన్ ధనరాజ్, పోసాని కృష్ణ మురళీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో గానీ, ఈ టీజర్ గురించి పెద్దగా చెప్పడానికేం లేదు. అయితే గతంలో పలు కామెడీ చిత్రాలను తెరకెక్కించిన ట్రాక్ రికార్డ్ ఉన్న ఇ.సత్తిబాబు దర్శకుడు కావడమే ఈ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’కు ప్రధాన బలం.

ఇప్పటివరకు స్పూఫ్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ, తొలిసారిగా ప్రధాన పాత్రలో నటించిన సినిమా కావడంతో… ఏ మేరకు ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించగలుగుతాడో అన్న ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో ఉంది. సునీల్ తనకు ఆదర్శమంటూ చెప్పిన పృధ్వీ… సునీల్ మాదిరే తొలి సినిమాను విజయవంతంగా నిలుపుకుంటాడో లేదో చూడాలి. టీజర్ అయితే అలాంటి నమ్మకాన్ని వీక్షకులకు ఇవ్వలేకపోయింది.