Vijayasai Reddy - Rahul Gandhiకాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ నేపాల్ రాజధాని ఖాట్మండులో ఓ పెళ్ళికి హాజరైనప్పుడు ఆయన అక్కడ ఓ నైట్ క్లబ్‌లో జరిగిన వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ వేడుకలకు హాజరైన చైనా రాయబారి హౌ యాంక్వి అనే యువతితో ఆయన ఏదో మాట్లాడుతుండగా ఎవరో దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో దానిపై రచ్చరచ్చ జరుగుతోంది.

కాంగ్రెస్‌, బిజెపి మద్య మాటల యుద్ధం జరుగుతుండగా మద్యలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఈ వ్యవహారంలో వేలుపెట్టి ట్విట్టర్‌లో తన అమూల్యమైన అభిప్రాయాన్ని వెల్లడించారు.

“ఓ పక్క చైనా హనీ ట్రాప్ (అందమైన అమ్మాయిల ద్వారా విదేశీ రహస్యాలను రాబట్టడం) చేస్తుంటే, రాహుల్ గాంధీ నేపాల్ నైట్ క్లబ్‌లో పార్టీ చేసుకోవడం చాలా ఆందోళన కలిగిస్తోంది. ఆ పార్టీలో ఆయన చైనా రాయబారి హౌ యాంక్వితో సన్నిహితంగా మెలగడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే తమ అగ్రనేత ఈవిదంగా నైట్ క్లబ్‌లో పార్టీ చేసుకొంటుంటే అభ్యంతరం చెప్పని కాంగ్రెస్‌ నేతలు, ప్రధాని నరేంద్రమోడీ విదేశీ యాత్ర గురించి అనవసరమైన ప్రశ్నలు అడుగుతున్నారు,” అంటూ విమర్శించారు.

దీనిపై తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ ఛార్జ్ మానిక్కం టాగూర్ వెంటనే ధీటుగా స్పందిస్తూ విజయసాయి రెడ్డికి గట్టిగా వాతలు కూడా పెట్టారు.

“అవినీతికి మారుపేరైన విజయసాయి రెడ్డి… కాస్త వాస్తవాన్ని గమనించండి. మీ అధినేత సిఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులకు భయపడి మీరు మీ సాహెబ్‌ (ప్రధాని నరేంద్రమోడీ)ని సంతోషపెట్టేందుకు ఈవిదంగా అంటున్నారని మాకు తెలుసు. కానీ వాస్తవాన్ని మరిచిపోవద్దు. రాహుల్ గాంధీ నేపాల్ రాయబారి కుమార్తె వివాహానికి ఆహ్వానిస్తే వెళ్లారు. దానిలో తప్పేముంది?” అని ఘాటుగా జవాబు ఇచ్చారు.