కర్ణాటక ఎన్నికల దెబ్బకి కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆకాంక్ష మొదట్లోనే ప్రశ్నర్ధకంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక ఫెడరల్ ఫ్రంట్ అంటూ మద్దతు ఇచ్చిన జేడీఎస్ కాంగ్రెస్ పంచన చేరడంతో కేసీఆర్ కు తత్వం బోధ పడినట్టు అయ్యింది. దీనితో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు కాస్త పక్కన పెట్టారు.
అయితే మాజీ ఎంపీ మందా జగన్నాథంను దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు కేబినెట్ హోదా కల్పించింది. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. గతంలో లోక్సభాపక్ష నేతగా పనిచేసిన అనుభవం ఉన్నందున దిల్లీలో కేంద్ర ప్రభుత్వంతోని అపరిష్కృత అంశాలు, కేంద్ర మంత్రులతో చర్చలు, సంప్రదింపులు తదితర అంశాల్లో ఆయన సేవలను వినియోగించుకోవాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది.
దీంతో పాటు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న కేసీఆర్.. వివిధ పార్టీలతో సంప్రదింపుల కోసం దిల్లీలో ఏర్పాటు చేయనున్న కార్యాలయంలో సమన్వయకర్తగా ఆయన్ను నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆలూ లేదు చూలూ లేదు ఢిల్లీలో ఆఫీసు దానికి సమన్వయకర్త.. రాజకీయ నిరుద్యోగుల సహాయార్ధం చేసే పనులు కాకా ఇంకేమిటి ఇవి?