Manchu mohan babu and manchu vishnu ఇటీవల తాడేపల్లి విచ్చేసిన సందర్భంలో మంచు విష్ణు ఓ కీలక వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే. తన తండ్రికి ఆహ్వానం వచ్చినా దానిని మధ్యలో ఒకరు అడ్డుకున్నారు, నా తండ్రికి ఆ ఆహ్వానం అందకుండా చేసిన ఆ వ్యక్తి ఎవరో నాకు తెలుసు, కానీ ఆయన పేరును నేను చెప్పను అంటూ మీడియా ముఖంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే.

ఇది మంచు విష్ణు మాటలు. తాజాగా మంచు మోహన్ బాబు కూడా ఓ ఇద్దరు హీరోలపై ఆరోపణలు చేసారు. సోషల్ మీడియాలో చలామణి అవుతోన్న మేమ్స్, ట్రోలింగ్స్ చూసి చాలా బాధపడ్డానని, నా అంతటా నేనుగా వాటిని చూడను గానీ, ఎవరైనా పంపిస్తే మాత్రం చూస్తానని, ఎవరికైనా ఆత్మాభిమానం ఉంటుంది కదా, బాధపడక తప్పదని అన్నారు.

అయితే ఇదంతా ఎవరు చేయిస్తున్నారో కూడా తెలుసని, దీని వెనుక ఓ ఇద్దరు హీరోలు ఉన్నారని, ఓ 50 నుండి 100 మందిని అప్పాయింట్ చేసుకుని ప్రతి ఒక్కరిని ట్రోల్ చేయిస్తున్నారని, తాత్కాలికంగా ఆ ఇద్దరు హీరో బాగున్నప్పటికీ, ఏదొక రోజు శిక్ష అనుభవిస్తారని, ఎదుట వారిని బాధపెట్టేలా మేమ్స్ ఉండరాదని చెప్పారు గానీ, ఆ ఇద్దరూ హీరోల పేర్లను మాత్రం ప్రస్తావించలేదు.

ముక్కుసూటిగా ముఖం మీదే ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారని పేరున్న మోహన్ బాబు, ఇటీవల కాలంలో నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. ఏ విషయాన్ని కూడా ధైర్యంగా చెప్పేందుకు ముందుకు రావడం లేదు. ఒక విధంగా ఇది మంచిదే గానీ, ముక్కుసూటి తనంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను అని చెప్పడం మాత్రం కరెక్టేనా?

ఇక ట్రోల్స్ విషయానికి వస్తే, సహజంగానే సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ మేమ్స్ సందడి చేస్తుంటాయి. బ్రహ్మానందం, మంచు ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్ ఎప్పుడూ వాడుతూనే ఉంటారు. దీని వెనుక నిజంగా ఇద్దరు హీరోలు కంకణం కట్టుకుని చేయిస్తున్నారని చెప్పడం ఒకింత ఆశ్చర్యంగానే ఉంది. ఒకవేళ అదే నిజమైతే ఇండస్ట్రీలోనే ఉంటూ సహచరులను ఇబ్బంది పెట్టే పనులు చేయడం మాత్రం ఏ హీరోకు సమంజసం కాదు, ఆఖరికి అది మోహన్ బాబు అయినా!

లేటెస్ట్ గా మోహన్ బాబు మీద కొన్ని ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి. “సన్ ఆఫ్ ఇండియా” సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మీద, తెలంగాణాలో ఇప్పటివరకు 2 టికెట్లు బుక్ అయ్యాయని, ఏపీలో అయితే నో ఓపెనింగ్స్ అని గడిచిన కొద్దీ గంటలుగా సినిమాకు సంబంధించి ట్రోల్స్ హల్చల్ చేస్తున్నాయి. బహుశా ఇవి కూడా ఆ ఇద్దరు హీరోలే చేయిస్తున్నారా? ఏమో… అది మోహన్ బాబుకే తెలియాలి, తెలిసినా ఆయన మాత్రం ‘చెప్పను బ్రదర్’ అంటున్నారు.