Manchu-Manoj-Good-Bye-to-Movies‘దొంగ దొంగది’ సినిమాతో తెలుగు తెరపై హీరోగా ప్రత్యక్షమైన మంచు మనోజ్ బుధవారం పొద్దునే ఓ షాకింగ్ సందేశాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ఎవరి ఊహలకు అందని విధంగా తాను నటనకు దూరం కాబోతున్నానని స్పష్టం చేసారు. ప్రస్తుతం నటిస్తున్న “ఒక్కడు మిగిలాడు” మరియు ఇప్పటికే కమిట్ అయిన మరో సినిమానే నటుడిగా తన చివరి చిత్రాలుగా మంచు మనోజ్ ప్రకటించాడు.

నటన నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని ప్రకటించిన మంచు వారబ్బాయ్, తదుపరి ఏం చేయబోతున్నారనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. బహుశా తండ్రి స్థాపించిన లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ను చూసుకుంటూ నిర్మాణ రంగం వైపుకు అడుగులు వేస్తారా? లేక దర్శకత్వపు ఆలోచనల దిశగా అడుగులు వేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఇంతవరకు తనను ఆదరించినందుకు గానూ ధన్యవాదాలు కూడా తెలిపారు.

అయితే ఇందులో ఏదొక మతలబు ఉండే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు నెటిజన్లు. సినిమా టైటిలే “మై లాస్ట్ ఫిల్మ్స్ యాజ్ యాన్ యాక్టర్” అయ్యుండే అవకాశం ఉందని మంచుకు కౌంటర్లు వేస్తున్నారు. అయితే ఈ షాకింగ్ నిర్ణయాన్ని భవిష్యత్తులో సవరించే సంకేతాలు కూడా ఉన్నాయంటున్నారు సినీ జనాలు. అయితే ఇటీవల కాలంలో మంచు మనోజ్ లో చాలా మార్పు వచ్చిందన్న విషయం తెలిసిందే.

ఎన్నడూ లేని విధంగా రైతులు పడుతున్న ఇబ్బందులపై వరుస ట్వీట్లు చేసిన మంచు, రైతులకు అండగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి ఇటీవల దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా? అన్న టాక్ కూడా వినపడుతోంది. ఏమో… ఇలాంటి షాకింగ్ నిర్ణయాన్నే మరో ఉదయం నాడు ట్విట్టర్ వేదికగా పంచుకుంటాడేమో… ఎవరికి ఎరుక…!