jishnu raghavan is o moreగత కొన్ని సంవత్సరాలుగా కాన్సర్ బారిన పడి సినీ సెలబ్రేటీలు కాలం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో యువనటుడు కూడా అదే కాన్సర్ కు బలై సుదూర లోకాలకు పయనమయ్యాడు. 35 సంవత్సరాల మలయాళ నటుడు జిష్ణు రాఘవన్ నేడు కొచ్చిలోని అమృత హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

దాదాపుగా రెండు సంవత్సరాల నుండి కాన్సర్ చికిత్స తీసుకుంటున్న రాఘవన్ యువకుడే కావడంతో పూర్తిగా కోలుకుంటారని భావించారు. అయితే మళ్ళీ ఆ మహమ్మారి తిరగబెట్టడంతో మృత్యువు ఒడిలోకి రాఘవన్ చేరిపోక తప్పని పరిస్థితి నెలకొంది. 1987లో ‘కిల్లిపట్టు’ సినిమాతో బాలనటుడిగా నటజీవితం ప్రారంభించిన రాఘవన్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ‘నమ్మాల్’ చిత్రంలో ఎంట్రీ ఇచ్చి ఘనవిజయం సాధించారు.

జిష్ణు రాఘవన్ మరణంతో మలయాళ సినీ పరిశ్రమ తీరని శోకంలో మునిగినట్లయ్యింది. ఈ ఏడాది వరుసగా కల్పన, షాన్ జాన్సన్, వీడీ రాజప్పన్, రాజేష్ పిళ్లే, కళాభవన్ మణి వంటి మరణాలతో షాక్ లో ఉన్న మలయాళ సినీ ఇండస్ట్రీకి తాజాగా రాఘవన్ షాక్ తగిలినట్లయింది.